వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్ల‌లో కోత‌

వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్ల‌లో కోత‌

రాష్ట్రాల‌కు కేంద్రం అందించే ఉచిత క‌రోనా వ్యాక్సిన్ల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. వీటి ప్ర‌కారం ఇక నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు జ‌నాభా, కేసుల సంఖ్య‌, వ్యాక్సినేష‌న్ పురోగ‌తి ఆధారంగా వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. 

అంతేకాదు వ్యాక్సిన్ వృథా ఎక్కువ‌గా ఉంటే ఇవ్వ‌బోయే వ్యాక్సిన్ల సంఖ్య‌లో కోత ఉంటుంద‌నీ హెచ్చ‌రించింది. ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే ఈ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్రం విడుద‌ల చేసింది.

ప‌లు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు కేంద్రం చెబుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన డేటా ప్ర‌కారం.. జార్ఖండ్‌లో అత్య‌ధికంగా 37 శాతం వ్యాక్సిన్ వృథా ఉంది. 

ఆ త‌ర్వాతి స్థానాల్లో చ‌త్తీస్‌గ‌ఢ్ (30 శాతం), త‌మిళ‌నాడు (15.5 శాతం), జ‌మ్ముక‌శ్మీర్ (10.8 శాతం), మ‌ధ్యప్ర‌దేశ్ (10.7 శాతం) ఉన్నాయి. వ్యాక్సిన్ల వృథాలో జాతీయ స‌గ‌టు 6.3 శాతం కాగా.. ఈ రాష్ట్రాలు అంత‌క‌న్నా ఎక్కువ‌గా వృథా చేస్తున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ తెలిపింది.

కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు
  • 18 ఏళ్లు నిండిన వాళ్లంద‌రికీ వ్యాక్సిన్లు ఇస్తున్న నేప‌థ్యంలో వీళ్లలో ప్రాధాన్య‌తా క్ర‌మం నిర్ణ‌యించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కే ఉంటుంది.
  • వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచ‌డానికి, కొత్త వ్యాక్సిన్ల‌న ప్రోత్స‌హించ‌డానికి మొత్తం ఉత్ప‌త్తిలో 25 శాతం నేరుగా ప్రైవేటు హాస్పిట‌ల్స్‌కు అమ్ముకునే అవ‌కాశం త‌యారీదారుల‌కు క‌ల్పించారు.
  • ప్రైవేటు హాస్పిట‌ల్స్‌కు అమ్మే ధ‌ర‌ను ప్ర‌తి వ్యాక్సిన్ త‌యారీదారు ప్ర‌క‌టించాలి. అందులో మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేయాలి. ప్రైవేటు హాస్పిట‌ల్స్ గ‌రిష్ఠంగా స‌ర్వీస్ చార్జీల రూపంలో రూ.150 వ‌సూలు చేయాలి. ఈ ధ‌ర‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ర్య‌వేక్షించ‌వ‌చ్చు.
ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,498 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో 63 రోజుల తర్వాత రోజువారి కొత్త కేసులు సంఖ్య లక్ష కన్నా తక్కువగా నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 2,89,96,473కు పెరిగింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 2123 మంది కరోనా బాధితులు మరణించగా, ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,51,309కు పెరిగింది.