దేశీయంగా కరోనా టీకాను రికార్డు సమయంలో రూపొందించారని భారతీయ శాస్త్రవేత్తలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని అధ్యక్షతన గల కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంస్థ శాస్త్రవేత్తలతో ప్రధాని వర్చువల్గా సమావేశమవుతూ గతంలో విదేశాల్లో రూపొందించిన వాటిని పొందేందుకు భారత్ సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చేదని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెబుతూ విదేశీ శాస్త్రవేత్తలతో కలిసి, సరిసమానంగా భారతీయ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని కొనియాడారు. కొవిడ్తో పోరులో 15 నెలలుగా మన శాస్త్రవేత్తల కృషి నమ్మశక్యం కాని విధంగా ఉందని అబ్బురపడ్డారు. ఈ శతాబ్దంలో మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం కరోనా అని ప్రధాని పేర్కొన్నారు. అయితే, మానవాళి ఏదైనా సంక్షోభం ఎదుర్కొన్న ప్రతీసారి, సైన్స్ దాన్ని ఎదుర్కోవడానికి మార్గం చూపిందని మనకు చరిత్ర చెబుతోందని వివరించారు.
మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్నే కాకుండా, దేశీయంగా కరోనా టెస్టింగ్ కిట్స్ను, కోవిడ్ చికిత్సకు ఔషధాలను రికార్డు సమయంలో భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించి, ‘ఆత్మనిర్భర్ భారత్’ను నిజం చేశారని ప్రశంసించారు. భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగా కోవాగ్జిన్ కోవిడ్ టీకాను తయారుచేసిన విషయం తెల్సిందే. ఆక్సిజన్ ఉత్పత్తిని కూడా రికార్డు సమయంలో భారీగా పెంచామని గుర్తు చేశారు.
‘మీ కృషి, మీ అద్భుతమైన మేథ కారణంగానే ఈ భారీ యుద్ధాన్ని చేయగలుగుతున్నాం’అని శాస్త్రవేత్తలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. స్వయం సమృద్ధ భారత్, సుదృఢ భారత్ తమ లక్ష్యాలని, అయితే, ఈ కరోనా మహమ్మారి కారణంగా ఆ లక్ష్యసాధన కొంత ఆలస్యమవుతోందని వివరించారు. అయితే, కచ్చితంగా వాటిని సాధిస్తామని భరోసా వ్యక్తం చేశారు.
‘మన లక్ష్యాలెప్పుడూ భవిష్యత్తు కన్నా రెండడుగులు ముందుండాలి’ అని స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధి, స్వచ్ఛ విద్యుత్ తదితర అంశాల్లో భారత్ ప్రపంచ దేశాలకు మార్గం చూపుతోందని, సాఫ్ట్వేర్, శాటిలైట్ టెక్నాలజీలతో చాలా దేశాల అభివృద్ధిలో భాగం పంచుకుంటోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పు మహమ్మారిని ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తల బృందం ఇప్పటినుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2016లో ప్రారంభించిన ‘అరోమా మిషన్’ విజయంలో సీఎస్ఐఆర్ పాత్రను ప్రధాని గుర్తు చేశారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ