కర్ణాటకలో రూ 500 కోట్ల ఆర్ధిక ప్యాకేజి, బెంగాల్ ఆంక్షల సడలింపులు  

కర్ణాటకలో రూ 500 కోట్ల ఆర్ధిక ప్యాకేజి, బెంగాల్ ఆంక్షల సడలింపులు  
కర్ణాటకలో కరోనా వ్యాప్తి కేసుల సంఖ్య ఇంకా తగ్గక పోగా, రోజు రోజుకీ ఎక్కుగా నమోదవుతున్నాయి. దీంతో  ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ను జూన్‌ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప  సారి ప్రత్యేకంగా మత్స్యకారులు, పూజారులు, పవర్‌లూమ్ కార్మికులు, ఇతరులకు రూ  500 కోట్ల  ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రజల జీవనోపాధి కోసం 1,250 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశాపారు.  అలాగే, తమ ప్రభుత్వం ఈ నెలలో 60 లక్షలకు పైగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
జూన్ 30 నాటికి దాదాపు 2 కోట్ల మందికి టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యాక్సిన్లను సరఫరాకు చేయుత అందించిన ప్రధాని మోదీకి యడ్యూరప్ప ట్వీటర్లో ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయని, మరికొన్ని రోజులు లాక్ డౌన్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని  ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలే మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు.

కాగా, కొవిడ్-19 కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గడంతో ప‌శ్చిమ బెంగాల్ లో లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌ల‌కు ప‌లు స‌డ‌లింపులు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిని విధుల్లోకి అనుమ‌తిస్తామ‌ని సీఎం మమ‌తా బెన‌ర్జీ  ప్ర‌క‌టించారు. ఇత‌ర రాష్ట్రాల త‌ర‌హాలో తాము లాక్‌డౌన్ విధించ‌లేద‌ని, క‌ఠిన నియంత్ర‌ణ‌ల‌తోనే వైర‌స్ ను క‌ట్ట‌డి చేస్తామ‌ని ఆమె స్పష్టం చేశారు. 

బెంగాల్ లో కొవిడ్-19 కేసులు స‌గానికి త‌గ్గాయ‌ని ఇప్ప‌టివ‌ర‌కూ 1.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందించామ‌ని దీదీ పేర్కొన్నారు. ప్ర‌ధాన ఆల‌యాల్లో పూజారుల‌కు వ్యాక్సినేష‌న్ చేప‌డ‌తామ‌ని చెప్పారు. 

ఇక రిటైల్ షాపుల‌ను మ‌ద్యాహ్నం 12 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కూ అనుమ‌తిస్తారు. ఐటీ సెక్టార్ ను రెండు షిఫ్టుల్లో ప‌నిచేసే వెసులుబాటు క‌ల్పించారు. వ్యాక్సిన్ పూర్త‌యిన సిబ్బందితో రెస్టారెంట్లు సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ తెరిచేందుకు అనుమ‌తించారు.