అస్సాంలో వైద్యుడిపై దాడి… 24మంది అరెస్ట్

అస్సాం రాష్ట్రం హోజాయ్ జిల్లాలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో మరణించిన రోగి కుటుంబసభ్యులు ఓ జూనియర్ డాక్టర్ పై మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
మంగళవారం మధ్యాహ్నం ఓడాలిలోని కోవిడ్-19 ఆసుపత్రిలో కరోనా రోగి చనిపోయాడు. దీంతో బంధువులు యువ వైద్యుడిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఐఎంఎ అస్సాం స్టేట్ బ్రాంచ్ బుధవారం రాష్ట్రంలోని వైద్యులందరూ వైద్య సేవలను మానుకోవాలని పిలుపునిచ్చింది.
 
 “ఈ అనాగరిక దాడిలో పాల్గొన్న 24 మంది నిందితులను అరెస్టు చేశారు. చార్జిషీట్ త్వరగా దాఖలు చేయబడుతుంది. నేను ఈ దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను ”అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేశారు. 
 
కాగా, యువ వైద్యుడు కుమార్‌ సేనాపతి ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతంలో విధుల్లోకి వెళ్లిన మొదటి దాడి అని అసోం శాసన సభ డెప్యూటీ స్పీకర్‌ డాక్టర్‌ నుమల్‌ మోమిన్‌ పేర్కొన్నారు.

ఇలా ఉండగా, క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ డాక్ట‌ర్‌పై దాడి కేసులో న‌లుగురు యువ‌కుల‌ను అరెస్టు చేసిన‌ట్లు చిక్క‌మ‌గ‌ళూరు ఎస్పీ తెలిపారు. డెంగీతో బాధ‌ప‌డుతున్న ఆరేండ్ల వ‌య‌సున్న భువ‌న్ అనే బాలుడిని చికిత్స నిమిత్తం చిక్క‌మ‌గళూరు జిల్లాలోని తారికేరి ప‌ట్ట‌ణ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతికి డాక్ట‌ర్ దీప‌క్‌ (50) కార‌ణ‌మ‌ని మృతుడి బంధువులు ఆరోపించారు.

ఈ క్ర‌మంలో సోమ‌వారం లంచ్ కోసం న‌డుచుకుంటూ వెళ్తున్న డాక్ట‌ర్ దీప‌క్‌పై మృతుడి బంధువుతో పాటు మ‌రో ముగ్గురు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని డాక్ట‌ర్‌ను చికిత్స నిమిత్తం శివ‌మొగ్గ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ కేసులో డాక్ట‌ర్‌పై దాడి చేసిన న‌లుగురు యువ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.