విదేశీ టీకాలకు ట్ర‌య‌ల్స్ నుంచి భారత్ మినహాయింపు 

భారత్ లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డంలో భాగంగా డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే వివిధ దేశాలు, డ‌బ్ల్యూహెచ్ అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్ల‌కు భారత్ లో మ‌ళ్లీ ట్ర‌య‌ల్స్ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. 

ఈ నిర్ణ‌యంతో ఫైజ‌ర్‌, మోడెర్నాలాంటి వ్యాక్సిన్ల‌కు లైన్ క్లియ‌ర్ కానుంది. ఈ రెండు కంపెనీలు ఇప్ప‌టికే న‌ష్ట‌ప‌రిహారం, ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌డం వంటి వాటిని ఎత్తేయాల‌ని కోరాయి. దేశంలో వ్యాక్సిన్ల‌కు ఉన్న డిమాండ్‌, భారీగా పెరిగిపోతున్న కేసుల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు డీసీజీఐ చీఫ్ వీజీ సోమానీ వెల్ల‌డించారు.

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం డీసీజీఐకి ఈ సిఫార‌సు చేసింది. ఇప్ప‌టికే ప్ర‌పంచవ్యాప్తంగా కోట్ల మంది తీసుకున్న వ్యాక్సిన్లు, యూఎస్ ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ, జ‌పాన్ లేదా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎమ‌ర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో ఉన్న వ్యాక్సిన్ల‌కు భారత్ లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ అవ‌స‌రం లేద‌ని నిర్ణ‌యించిన‌ట్లు సోమానీ తెలిపారు. 

గ‌తంలో విదేశాల్లో ట్ర‌య‌ల్స్ పూర్తి చేసి అనుమ‌తి పొందిన వ్యాక్సిన్లు కూడా భారత్ లో బ్రిడ్జింగ్ ట్ర‌య‌ల్స్ లేదా ప‌రిమిత స్థాయిలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాల‌న్న నిబంధ‌న ఉండేది. ఇప్పుడా నిబంధ‌న‌ను ఎత్తేశారు.

  కాగా, భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌కు చెందిన‌ కోవాగ్జిన్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు మ‌హారాష్ట్ర‌కు చెందిన హాఫ్‌కైన్ ఫార్మా సంస్థ‌కు అనుమ‌తి ద‌క్కింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో కోవాగ్జిన్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు హెచ్‌బీపీసీఎల్ సంస్థ పేర్కొన్న‌ది.

 కోవాగ్జిన్ ఉత్ప‌త్తికి అనుమ‌తి ద‌క్కిన నేప‌థ్యంలో భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని, రాబోయే 8 నెలల్లోగా ఉత్ప‌త్తిని ప్రారంభిస్తామ‌ని ఆ కంపెనీ ఎండీ సందీప్ రాథోడ్ తెలిపారు. 

ముంబైలో ఉన్న ల్యాబ్‌లోనే ఏడాదికి సుమారు 22 కోట్ల డోసుల‌ను హాఫ్‌కైన్ ఫార్మా సంస్థ ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ది. త‌మ‌కు సంస్థ‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం 93 కోట్లు నిధుల‌ను విడుద‌ల చేసింద‌ని, కేంద్రం కూడా 65 కోట్లు ఇవ్వ‌నున్న‌ద‌ని ఎండీ రాథోడ్ తెలిపారు.