ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు టీకా డోసులు 

కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరులో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. దేశంలో ఇప్పుడు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సినేషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న వాటిని బట్టి టీకాలు వేస్తున్నారు. అయితే, తొలుత ఏ సంస్థ టీకా వేసుకుంటే రెండో డోసు కూడా అదే వేయించుకోవాలన్న నియమం ఉంది. అయితే, ప్రస్తుతం టీకాల కొరతతో వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిదానంగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు టీకా డోసులు ఇచ్చే విధానంపై కసరత్తు ప్రారంభించింది. దీంతోపాటుగా కొవిషీల్డ్ టీకాను ఒకే డోసుతో సరిపెట్టాలన్న యోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. వేర్వేరు డోసుల విధానంపై మరో నెల రోజుల్లో ట్రయల్స్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. గరిష్టంగా రెండున్నర నెలల్లో దీనిపై ట్రయల్స్ ముగిస్తారని, ఆ తర్వాత కొవిషీల్డ్ సింగిల్ డోస్‌పై ట్రయల్స్ మొదలవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రెండు వేర్వేరు టీకా డోసులను ఇవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాలను నమోదు చేసేందుకు ఓ యాప్‌ను తయారు చేసి దానిని కొవిన్ యాప్‌తో అనుసంధానం చేస్తారని తెలుస్తోంది. ఫలితంగా రెండు వేర్వేరు టీకా డోసులు తీసుకున్న వారు తమకు ఎదురయ్యే సమస్యలను అందులో నమోదు చేయడం ద్వారా నిపుణుల దృష్టికి ఆ విషయాలు చేరుతాయని చెబుతున్నారు.

త్వ‌ర‌లోనే దేశంలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభిస్తున్నట్లు   ఇమ్యునైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా  ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. త్వరలో రెండు వేర్వేరు మోతాదుల కొవిడ్ వ్యాక్సిన్‌ను పరీక్షించ‌నున్న‌ట్లు ఆయ‌న‌ చెప్పారు. 

మరోవైపు, కొవిషీల్డ్ టీకా తొలి డోసు తీసుకున్న వారిలోనూ మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్టు ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో సింగిల్ షాట్‌పైనా ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం  అవుతోంది. 

ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సింగిల్ షాట్ టీకాలైన ‘స్పుత్నిక్ లైట్’, ‘జాన్సన్ అండ్ జాన్సన్’ టీకాలు కూడా కొవిషీల్డ్ ఫార్ములా ఆధారంగా తయారైనవే. కాబట్టి కొవిషీల్డ్ సింగిల్ డోస్ టీకాపై ట్రయల్స్ మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక ప్రతిస్పందనను పెంచేందుకు సహాయపడుతుందో, లేదో తెలుసుకునేందుకు రెండు వేర్వేరు టీకాలను ఇచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యలను పరీక్షించేందుకు భారత్  సిద్ధమవుతోందని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే ఆరోరా వెల్లడించారు. 

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఇటీవల 20 మందికి తొలి డోసుగా కొవిషీల్డ్, రెండో డోసుగా కొవాగ్జిన్ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. అయితే, ఇలా వేర్వేరు డోసులు ఇవ్వడం వల్ల ప్రమాదమేమీ ఉండబోదని నిపుణులు చెబుతున్నారు.