కోవిడ్‌ కట్టడికి కలసికట్టుగా అమెరికా, భారత్ 

కోవిడ్‌ కట్టడికి కలసికట్టుగా అమెరికా, భారత్ 

కోవిడ్‌19ను నిర్మూలించేందుకు క‌లిసి క‌ట్టుగా ప‌నిచేస్తున్నామ‌ని అమెరికా, భారత్ విదేశాంగ మంతృలు ప్రకటించారు. స‌మ‌కాలీన‌ ప‌రిస్థితుల్లో ఎదుర‌వుతున్న ఎన్నో స‌వాళ్ల‌ను అమెరికా, భారత్  సంయుక్తంగా స్పందిస్తున్న‌ట్లు అమెరికా  విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. 

అమెరికా పర్యటనలో ఉన్న భారత  విదేశాంగ శాఖ ఎస్ జైశంక‌ర్‌ ను కలసిన సందర్భంగా మాట్లాడుతూ తాము కోవిడ్‌తో స‌త‌మ‌తం అవుతున్న వేళ భార‌త్ అందించిన స‌హాయాన్ని ఎన్న‌టికీ మరిచిపోలేమ‌ని స్పష్టం చేశారు. అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఆ దేశాన్ని విజిట్ చేసిన తొలి భార‌తీయ మంత్రి ఆయ‌నే కావడం గమనార్హం. 

కోవిడ్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో అమెరికాకు భారత్  అండ‌గా నిలిచింద‌ని, ఆ దేశం అందించిన స‌హాయాన్ని తామెన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని బ్లింకెన్ పేర్కొన్నారు. ఇప్పుడు, ఈ ద‌శ‌లో భారత్ కు  అండ‌గా తాము ఉన్నామ‌ని బ్లింకెన్ వెల్ల‌డించారు. “మేము భారత్ – చైనా సరిహద్దు అంశాలను, ఆఫ్ఘానిస్తాన్ లోని పరిస్థితులను కూడా చర్చించాము. స్నేహితులంగా ఈ అంశాలలో మా మధ్యగల ఏకాభిపాయలపై కలసి పనిచేసే ప్రయత్నం చేస్తాం” అని బ్లింకేన్ చెప్పారు. 

జై శంక‌ర్ అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ  రెండు దేశాల మ‌ధ్య చ‌ర్చించేందుకు అనేక అంశాలు ఉన్నాయ‌ని, మ‌న మ‌ధ్య ఉన్న బంధం మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్లు భావిస్తున్నాన‌ని చెప్పారు. ఇది ఇలాగే కొన‌సాగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. విప‌త్క‌ర స‌మ‌యంలో అమెరికా ఇచ్చిన మ‌ద్ద‌తు, స‌హ‌కారం, సంఘీభావానికి కృతజ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు జైశంక‌ర్ పేర్కొన్నారు.

టీకాలను మరింతగా అందుబాటులోకి తీసుకు రావడం, ఉత్పత్తి పెంచే విషయంలో భారత్ – అమెరికా భాగస్వామ్యం గురించి కూడా చర్చింనట్లు జైశంకర్ తెలిపారు. ఆసియా-పసిఫిక్, క్వాడ్, ఆఫ్ఘానిస్తాన్, మయన్మార్, ఐక్యరాజ్యసమితి భద్రత మండలి, ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించామని జైశంకర్ పేర్కొన్నారు.