త్రివిధ దళాల సమష్టితత్వం చాలా ముఖ్యం

ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిధ దళాలు పరస్పర సహకారంతో, సమష్టితత్వంతో పని చేయాలని భారత నావికా దళం చీఫ్ అడ్మిరల్ కరంబిర్ సింగ్ పిలుపునిచ్చారు. గతంతో పోల్చితే నేడు యుద్ధం స్వభావం మారిందని, ఈ సమయంలో సమష్టితత్వం చాలా ముఖ్యమని చెప్పారు. 

శనివారం ఆయన పూణే సమీపంలోని ఖడక్వస్లలో జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) 140వ కోర్సు పాసింగ్ అవుట్ పెరేడ్‌ను సమీక్షించిన అనంతరం మాట్లాడుతూ భూమి, సముద్రం, గాలి, అంతరిక్షం, సైబర్ స్పేస్ వంటివాటన్నిటిలోనూ ప్రత్యర్థులను ఎదుర్కొనడం ముఖ్యమని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిధ దళాలు కలిసికట్టుగా, సమష్టితత్వంతో పని చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. త్రివిధ దళాలు సమష్టితత్వంతో పని చేయడం గతంతో పోల్చితే నేడు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ దేశంలో మన దేశ రక్షణ రంగంలో చాలా ముఖ్యమైన సంస్కరణలు జరుగుతున్నట్లు తెలిపారు.

మిలిటరీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, త్వరలో ఏర్పడబోయే థియేటర్ కమాండ్స్ వంటి సంస్కరణలు జరుగుతున్నట్లు వివరించారు. త్రివిధ దళాల ప్రత్యేక పాత్ర సృష్టించిన అవసరాల మాదిరిగానే, ప్రతి దళానికి ఉండే సంప్రదాయాలు, ప్రత్యేక గుర్తింపు, యూనిఫారాలు, ఆచారాలు చాలా ముఖ్యమైనవని స్పష్టం చేశారు.

నేటి సంక్లిష్టమైన యుద్ధ క్షేత్రంలో మరింత సమన్వయంతో, సమర్థవంతంగా పని చేయడానికి సాయుధ దళాల మధ్య సమష్టితత్వం చాలా అవసరమని తెలిపారు. ఎన్‌డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) 72 సంవత్సరాల నుంచి సమష్టితత్వానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. సమష్టితత్వం మౌలిక విలువలను ఇది అమలు చేస్తోందని కొనియాడారు.

ఈ అకాడమీ స్థాపనలో ముఖ్యమైన సిద్ధాతం ఇదేనని పేర్కొంటూ భవిష్యత్తులో యుద్ధం ఏవిధంగా ఉంటుందనేదానితో సంబంధం లేకుండా సమర్థ నాయకత్వానికి కొన్ని వ్యక్తిగత సామర్థ్యాలు, ఆకర్షణలు చాలా ముఖ్యమైనవని గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం నాయకత్వ లక్షణమని వివరించారు. 

సమష్టితత్వం (జాయింట్‌నెస్) అనే పదాన్ని అమెరికా దళాలు సృష్టించాయి. సైనికపరమైన అన్ని ప్రక్రియల్లోనూ, ప్రతి దశలోనూ త్రివిధ దళాలు పరస్పరం సహకరించుకోవడమే సమష్టితత్వం. ఆయుధాల సేకరణ నుంచి కార్యకలాపాల వరకు ప్రతి దశలోనూ ఈ సహకారం త్రివిధ దళాల మధ్య ఉండాలనేదే దీని ఉద్దేశం అని పేర్కొన్నారు.