భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ట్విట్టర్‌ ప్రయత్నం 

భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ట్విట్టర్‌ ప్రయత్నం 

పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ట్విట్టర్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అబద్ధమని కేంద్రం స్పష్టం చేసింది.  భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నంగా దీనిని అభివర్ణించింది.

‘ట్విట్టర్‌ సహా సామాజిక మాధ్యమ సంస్థలన్నీ భారత్‌లో ఇప్పటివరకు భద్రంగా ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదు’ అని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రూల్స్‌ నిర్దేశించడానికి ట్విట్టర్‌ చేసిన ప్రయత్నమే ఆ ప్రకటన’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

భారతీయ న్యాయవ్యవస్థను ట్విట్టర్‌ తక్కువ చేసి చూపుతున్నదని అసహనం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌ ముసుగులో గుద్దులాట మాని భారతీయ చట్టాలను తప్పక పాటించాలని హెచ్చరించింది. ట్విట్టర్‌ కేవలం సామాజిక మాధ్యమ సంస్థ అని, ఒక దేశం ఎలా చట్టాలు చేయాలన్నదానిపై దాని సూచనలు అక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

తమ సంస్థపై పోలీసుల జరిపిన సోదాలు బెదిరింపుల్లా ఉన్నాయని ట్విట్టర్‌ ఆందోళన వ్యక్తంచేయడం పట్ల భారత్ అభ్యంతరం తెలిపింది.   కేంద్రం తెచ్చిన కొత్త ఐటీ చట్టాలవల్ల భారతదేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు ఉంటుందని పేర్కొనడం పట్ల మండిపడింది.