ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం … చంద్రబాబు 

ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం … చంద్రబాబు 

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉగ్రవాదం  నడుస్తోందని, ప్రభుత్వ తప్పిదాలపై ఎవరు మాట్లాడితే వారి నోరు మూయించే ప్రయత్నం పోలీసులతో చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. డిజిటల్‌ పద్దతిలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల పార్టీ వార్షిక సమావేశం మహానాడులో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసం నుండి ప్రసంగీస్తూ  రాష్ట్రాన్ని వేధింపులు, కక్ష సాధింపులకు చిరునామాగా మార్చారని మండిపడ్డారు.

ప్రభుత్వ చర్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయని, కోర్టులను కూడా ప్రభుత్వం బెదిరిస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దెందలూరి ప్రభాకర్‌, జెసి ప్రభాకర్‌ రెడ్డి, దూళిపాళ్ల నరేంద్ర, రామకృష్ణా రెడ్డి, బీటెక్‌ రవి, బీసీ జనార్ధన్‌ రెడ్డిలను తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేశారని మండిపడ్డాయిరు.

అధికార పార్టీ ఎంపి రఘురామకృష్ణమ రాజును పోలీస్‌ కస్టడీలోనే తీవ్రంగా కొట్టారని, సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే కేసులు.. అరెస్టులు. ఆస్పత్రిలో రోగులను పరామర్శించడానికి వెళ్తే అరెస్టులు. మీడియాపై దేశ ద్రోహం కేసులని వివరించారు. డాక్టర్‌ సుధాకర్‌ చేసిన నేరం ఏంటి? అంటూ మాస్క్‌ ఆడిగిన పాపానికి పిచ్చి వాడిని చేసి హింసించి హింసించి చనిపోయేలా చేశారని ధ్వజమెత్తారు.

వైఎస్‌ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అబ్దుల్‌ సలాం కుటుంబాన్ని వైసిపి నాయకులు బలిగొన్నారని , కోడెల శివప్రసాద్‌ ను వేధించి ఆత్మహత్య చేసుకొనేలా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వాక్‌ స్వాతంత్య్రం ఉందా? అని ప్రశ్నించారు.

పోలీసులు అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడితే టీడీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎదురు తిరిగి ప్రైవేటు కేసులు వేయాలని చెబుతూ ఈ విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయమని చెబుతూ ఎంపీ రఘురామరాజు అలా చేయడం వల్లే పై నుంచి కిందవరకూ అందరూ ఇరుక్కుపోయారని గుర్తు చేశారు.

తిరుపతి రుయా ఆసుపత్రుల్లో 32 మంది చనిపోయారని పేర్లతో సహా ఇస్తే ప్రభుత్వం మాత్రం 11 మంది చనిపోయారని తప్పుడు సమాచారం ఇచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికారణంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, బెడ్స్‌ లేని పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. చనిపోయిన కరోనా బాధితులకు అంత్యక్రియులు కూడా చేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందని ఎద్దేవా చేశారు ఈ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కున్న పార్టీగా మేము సలహాలు ఇస్తాం, కలిసి పని చేద్దామంటే కనీసం తీసుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.