130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్‌

భారతదేశంలో 130 రోజుల్లో 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అంద‌జేశారు. అమెరికా త‌ర్వాత ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా భార‌త్ నిలిచింది. అమెరికా 20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి 124 రోజుల స‌మ‌యం ప‌ట్టింది.

60 ఏండ్ల వ‌య‌సు పైబ‌డిన జ‌నాభాలో 42 శాతం మందికి మొద‌టి డోసు ఇచ్చినట్లు, కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో రోగనిరోధకత పెంచుకోవ‌డానికి ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి 18-44 ఏండ్ల‌లోపు మొత్తం 1.28 కోట్ల మందికి వ్యాక్సిన్ మొదటి మోతాదు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ వయస్సు గల 9,42,796 మంది లబ్ధిదారులకు మంగళవారం మొదటి డోసు ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 20 కోట్ల 4 లక్షల 94 వేల 991 మోతాదుల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 97,94,835 మంది ఆరోగ్య కార్యకర్తలు ఫ‌స్ట్ డోసు తీసుకోగా, 67,28,443 మంది ఆరోగ్య కార్యకర్తలు సెకండ్ డోసు తీసుకున్నారని వెల్ల‌డించారు. 

1.77 కోట్లకు పైగా కొవిడ్ -19 వ్యాక్సిన్లు ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, రాబోయే 3 రోజుల్లో రాష్ట్రాలకు లక్ష మోతాదులో టీకాలు వస్తాయ‌ని పేర్కొన్న‌ది. కేంద్రం ఇప్పటివరకు 22,00,59,880 మోతాదుల వ్యాక్సిన్‌ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచిత క్యాట‌గిరీలో అందించిన‌వే కాకుండా రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేశాయ‌ని మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, బ్లాక్ ఫంగస్ (మ్యూకర్‌మైకోసిస్) చికిత్స కోసం వినియోగించే 29,250 యాంఫోటెరిసిన్‌బి వయల్స్‌ను రాష్ట్రాలకు అదనంగా కేటాయించామని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి డివి సదానందగౌడ తెలిపారు. 

దేశంలో ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడినవారిలో 11,717మందికి చికిత్స అందిస్తున్నారని, ఆయా రాష్ట్రాల్లోని పేషెంట్ల సంఖ్య ఆధారంగానే కేటాయింపుల చేశామని ఆయన తెలిపారు. ఇంతకుముందు మే 24న 19,420 వయల్స్, మే 21న 23,680 వయల్స్‌ను రాష్ట్రాలకు పంపినట్టు గౌడ తెలిపారు.