ఆనందయ్య మందు కోసం ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది కళ్ళు

ప్రజలందరూ కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న వేళ నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యులు శ్రీ ఆనందయ్య గారి ఆయుర్వేద మందు అందరికీ ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది.

అనుమతుల పేరుతో ఎన్ని అవాంతరాలు ఎదురౌతున్నా ప్రజలలో మాత్రం ఆనందయ్య వైద్యం పట్ల రోజురోజుకూ ఆదరణ, ఆకర్షణ పెరుగుతూ ఉండడం గమనార్హం.

ప్రజలు ఏమీ తెలియని అమాయకులని, కేవలం మాయలకు, మంత్రాలకు, చిట్కా మందులకు లోబడిపోయే పామరులనీ, తాము మాత్రం ప్రజలను జ్ఞాన శిఖరాల వైపుకు నడిపించే మేథావులమనీ భావించే కొందరు మాత్రం ఆనందయ్య వైద్యం నిరర్ధకమైనదని, దానివల్ల ఎన్నో దుష్పరిణామాలు సంభవించేస్తాయని ప్రజలను నమ్మించడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఇందులో కొన్ని మీడియా సంస్థలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఉచితంగా నయాపైసా ఖర్చు లేకుండా లభించే ఆనందయ్య వైద్యంతో స్వస్థత పొందిన వందలాది మంది రోగులు ఒకవైపు ఋజువుగా నిలువగా…. లక్షలు ఖర్చు చేసినా… అలోపతి వైద్యంతో స్వాంతన పొందలేక, ఇల్లు, వళ్ళు గుల్ల చేసుకుంటున్న వారు, అసలు ప్రాణాలే అరాయించుకుపోతున్న వారు మరోవైపు ఋజువుగా నిలచి సాధారణ ప్రజానీకం ఆనందయ్య మందును అపర సంజీవనిలా భావించే పరిస్థితి  ఉత్పన్నమైంది.

అభాండాలు – అబద్ధపు ప్రచారాలు

ఆనందయ్య వైద్యంతో స్వస్థత పొందిన కొందరు, అనంతరం కొంత అస్వస్థతకు గురైతే…. ఆనందయ్య ఆయుర్వేద వైద్యం వికటించిందంటూ కొందరు రాద్ధాంతం చేశారు. కొన్ని మీడియా సంస్థలయితే మృత్యు వాకిట నిలిచిన తనకు ఆనందయ్య మందు అమృతంలా పనిచేసి పునర్జన్మను ఇచ్చిందని బహిరంగంగా ప్రకటించిన విశ్రాంత ఉపాధ్యాయుడు కోటయ్య  చిన్న అస్వస్థతకు గురై పక్కనే ఉన్న టౌన్ లోని ఆసుపత్రికి వెళితే ఆనందయ్య మందు వికటించి కోటయ్య మృతిచెందాడంటూ అబద్ధపు ప్రచారానికి కూడా ఒడిగట్టాయి.

అసలు నిజాలు

కానీ ప్రజలు మాత్రం ఇలాంటి దుష్ప్రచారాన్ని, ఇలాంటి వారి దుష్ప్రయత్నాన్ని గ్రుడ్డిగా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వారి కళ్ల ముందే వారికి లెక్కలేనన్ని తార్కాణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే తమ బంధువులలోనో,  సన్నిహితులలోనో, ఇతర పరిచయస్తులలోనో ఎవరో ఒకరు ఆనందయ్య మందు ద్వారా పూర్తి స్వస్థత పొందినట్లుగా వారు తమ అనుభవాలను వివరిస్తున్నారు.

అంతెందుకు మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలోనే ఈరోజు దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న ఒక యువకుడి కంట్లో ఆనందయ్య మందు వేసిన నిమిషాల వ్యవధిలో ఆ యువకుడు లేచి కూర్చున్న సంఘటన రాష్ట్రమంతటికీ ఆనందయ్య మందు పనితనానికి సాక్షీభూతంగా నిలచింది.

ఆనందయ్య మందు పని చేస్తున్నదనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఇంకేం కావాలి? ఈ సీజన్ లోనే కాదు గత సంవత్సర కాలంగా ఆనందయ్య తన వైద్యం ద్వారా ఎందరో కరోనా రోగులను ఆరోగ్యవంతులుగా చేశారు. తాను ఈ మందు తయారీ చెన్నై సమీపంలోని రెడ్ హిల్స్ వద్ద గల డాక్టర్ వివేకానంద గారి సహకారంతో చేస్తున్నట్లుగా ఆనందయ్య వెల్లడిస్తున్నారు.

ఆనందయ్య గారి కుటుంబానికి ఈ ఆయుర్వేద వైద్యం పరంపరగా వస్తూ ఉన్నది. ఆనందయ్య గారు కూడా గత 30 సంవత్సరాలుగా అనేక  రోగాలకు ఉచితంగా వైద్యం చేస్తూ వస్తున్నారు.

ఈ సంవత్సరం శ్రీ రామనవమి నాటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 50 వేల మంది కరోనా రోగులకు తాను కనీసం మాస్కు కూడా ధరించకుండా కరోనా మందును అందించారు ఆనందయ్య. తాను కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ  కరోనా బారిన పడలేదు. తన మందు అద్వితీయంగా పనిచేస్తున్నదనడానికి ఆనందయ్య తనకు తానే ప్రబల సాక్ష్యంగా నిలిచారు. అంతేకాదు వారి గ్రామంలో కూడా ఎవరూ ఇప్పటివరకూ తీవ్రమైన కరోనా లక్షణాలతో ఆసుపత్రి పాలు కాలేదు. అసలిప్పటి వరకూ వారి గ్రామంలో కరోనా మరణాలు సంభవించలేదంటే  నమ్మక తప్పదు.

పనితీరు – విచారణ తీరు తెన్నులు – వెల్లడవుతున్న వాస్తవాలు

ఆనందయ్య గారు ఆంగ్ల అక్షరాలు P, L, F, K, I అనే పేర్లతో తన మందులను ఇస్తున్నారు. వీటిలో P –  కరోనా రాకుండా నిరోధించే ప్రివెంటివ్ మెడిసిన్. L –  ఆకలి మందగించిన వారికి ఇచ్చే మందు. F –  జ్వర ( ఫీవర్) పీడితుల కోసం. K –  కిడ్నీ సమస్యలతో బాధపడే వారి కోసం. I –  తీవ్రమైన కరోనా లక్షణాలు కలిగినవారికి  కంట్లో వేసే మందు.

ఆనందయ్య మందులు వాడిన కోవిడ్ బాధితులను కూలంకషంగా పరిశీలించగా…. వారందరూ మందు వాడిన మూడు రోజుల తర్వాత నెగిటివ్ రిపోర్ట్ పొందుతున్నారు. వెంటిలేటర్ పై ఉన్నవారు కూడా కోలుకున్న ఘటనలు ఎన్నో….

ఆయుష్ వారు, ఐసిఎంఆర్ వారు ఈ మందు తయారీ, పనితీరులను పరిశీలించే వరకూ ఈ మందు తయారీ, వితరణను ఆపవలసిందిగా అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే….

ఆయుష్ పరిశీలన బృందం తాము ఆనందయ్య మందును ఆయుర్వేద ఔషధంగా పరిగణించలేమని, నాటు మందుగా మాత్రమే పరిగణించగలమని తెలుపుతూ…. ఈ మందువలన ఎలాంటి దుష్ప్రభావాలు లేవని, ఇది సహజ సిద్ధమైన వనమూలికలతో తయారవుతున్న మందు కనుక నిరభ్యంతరంగా వాడవచ్చునని పేర్కొనడం గమనార్హం. అయితే ఇంకా ఐసీఎంఆర్ పరిశీలన జరగవలసి ఉంది.

ఆనందయ్య మందు తయారీని, పనితీరును పరిశీలించిన టీటీడీ ఆయుర్వేద వైద్య బృందం తమ ఆయుర్వేద ఔషధ తయారీ కేంద్రంలో ఈ మందును తయారు చేసుకోవడానికి అనుమతించారు.

ఆనందయ్య అరెస్టు నిజమేనా?

అయితే ఈలోగా ఆనందయ్యను పోలీసులు నిర్బంధించారని, ఆయన పోలీసుల పటిష్ట భద్రత మధ్య ఉన్నారని పేర్కొంటూ ప్రచారంలోకి వచ్చిన కొన్ని వార్తలను ప్రభుత్వ వర్గాలు నిర్ద్వందంగా ఖండిస్తున్నాయి.

ప్రభుత్వ అనుమతులు వచ్చాకే తాను మందును తయారు చేయాలనే ఆలోచనలో ఆనందయ్య  ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతులు వచ్చిన మీదట తాను రోజుకు లక్ష మందికి సరిపడా మందులు తయారు చేయగలనని ఆయన స్వయంగా ప్రకటించారు.

ఈ ఔషధాన్ని ఆనందయ్య మొదటినుంచీ ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. ఔత్సాహిక దాతల నుంచి కూడా ధన రూపంలో కాకుండా ఔషధ తయారీకి అవసరమైన వస్తువులను మాత్రమే స్వీకరిస్తూ వచ్చారు. అవకాశం దొరికితే రోగుల నుంచి లక్షలకు లక్షలు గుంజే వైద్యులున్న ఈ రోజులలో…..  లక్షలాదిమంది విశ్వాసాన్ని, ఆదరణను చూరగొన్న ఆనందయ్య తన మందును ఉచితంగా పంపిణీ చేస్తూ ఉండడం అబ్బురపరచే విషయం కాదా?

ఆనందయ్యకు ఆర్ఎస్ ఎస్ అండదండలు

ఆనందయ్య మందు వలన వందలాది మంది రోగులకు ఉపశమనం కలుగుతున్న సంగతిని, దాని తయారీకి, పంపిణీకి అనేక అడ్డంకులు ఎదురవుతున్న సంగతిని తెలుసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థానిక కార్యకర్తలు ఆనందయ్య మందు వాడిన అనేకమంది రోగులను నేరుగా కలిసి వారి అనుభవాలను తెలుసుకున్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు నేతృత్వంలోని బృందం కృష్ణ పట్నం గ్రామంలోని ఆనందయ్య ఔషధ తయారీ కేంద్రాన్ని పరిశీలించి, ఆనందయ్య గారిని కలిసి, మాట్లాడి, వివరాలు తెలుసుకుని మందు తయారీ, పంపిణీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని, దాని తయారీలోనూ, పంపిణీలోనూ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ విషయం ప్రసార మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆనందయ్య స్వగ్రామమైన కృష్ణపట్నానికి పరిశీలకుల బృందాన్ని పంపింది.

దాంతో ఆనందయ్యకు చిరపరిచితుడు, ఆయన మందు పనితీరును స్వయంగా పరిశీలించి రూఢీ పరచుకున్న స్థానిక ( సర్వేపల్లి నియోజకవర్గం) ఎమ్మెల్యే శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఆనందయ్యకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.

కానీ తన అద్భుత ఆవిష్కరణతో అందరివాడుగా మారిపోయిన ఆనందయ్యను తమ పార్టీ కార్యకర్తగా ఎమ్మెల్యే  గోవర్ధన్ రెడ్డి పరిచయం చేయడం. వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం పలు విమర్శలకు కారణమైంది.

విజ్ఞాన భారతి రాష్ట్రంలోని పలువురు ఆయుర్వేద వైద్యులతో నిర్వహించిన ఆన్ లైన్  సమావేశంలో పాల్గొన్న వైద్యులందరూ…. ఆనందయ్య గారి మందు అద్భుతంగా పని చేస్తున్నదని, సత్ఫలితాలనిస్తుందని పేర్కొనడమే కాకుండా…. దాని శాస్త్రీయతపై కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ మందు తయారీ,  పనితీరులపై తాము స్పష్టమైన నివేదికను రూపొందిస్తామని కూడా వారు పేర్కొన్నారు.

ఆనందయ్య గారి మందు వాడి స్వస్థత పొందిన కరోనా బాధితుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని  దానిని క్రమ పద్ధతిలో పొందుపరచాలనే ఉద్దేశ్యంతో విజ్ఞాన భారతి ఒక గూగుల్ ఫారం ను ప్రారంభించి దానిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళుతోంది.

ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా….. ప్రజలకు ఉచితంగా తన సేవలను అందిస్తున్న శ్రీ ఆనందయ్య మందుకు త్వరితగతిన అనుమతులు ఇప్పించ వలసిందిగా భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఆయుష్ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

ఇలా ఒకవైపు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికే ఎందరికో స్వస్థత చేకూర్చిన, మరెందరికో ఉపయుక్తంగా నిలబడగలిగిన ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి ఎదురవుతున్న అడ్డంకులపై ప్రజలలో తీవ్ర ఆవేదన, నిరసన వ్యక్తమవుతోంది.

ఎవరు ఎన్ని ఆధారాల కోసం ప్రశ్నించినా, ఎన్ని విచారణలు చేసినా, శల్య పరీక్షలు నిర్వహించినా ఆ మందు పని చేస్తున్నదనడానికి ప్రజల అనుభవాలే ప్రబల సాక్ష్యం. ఎన్నో సాక్ష్యాధారాలు కళ్ళముందు కనిపిస్తూ ఉన్నా ఇంకా దాని పనితీరుపై సందేహాలు వెలువరిస్తున్న మీడియా మరియు మేథావులనబడే కొందరి తీరుపైననే అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వారి వెనుక మెడికల్ మాఫియా ఉన్నదనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. వారి చిత్తశుద్ధి ప్రజా సంక్షేమం పైననా, మెడికల్ మాఫియా విదిల్చే చిల్లర పైసల పైననా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఆనందయ్య మందుకి వెంటనే అనుమతులు లభించాలని, ఆయన అందించే ఆ అపర సంజీవని అందరికీ అందాలని వేలాది హృదయాలు ఆకాంక్షిస్తున్నాయి. లక్షలాది కళ్ళు శ్రీ ఆనందయ్య మందు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి.