రూ.75కే డీఆర్డీవో కరోనా టెస్ట్ కిట్ 

ఇంతకుముందే కరోనాను అంతం చేసే 2డీసీ ఔషధాన్ని తయారు చేసిన జాతీయ రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) తాజాగా మరో కిట్‌ను రూపొందించింది. అతి తక్కువ ఖర్చుతో కచ్చితమైన కరోనా పరీక్ష నిర్వహించేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుందని డీఆర్డీవో చెబుతోంది. 
డీఆర్‌డీఓ ప్రయోగశాల డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్(డీఐపీఏఎస్) ఆధ్వర్యంలో ఈ యాంటీబాడీ డిటెక్షన్-బేస్డ్ కిట్ ‘డిప్‌కోవాన్(DIPCOVAN)’ను అభివృద్ధి చేసింది.
 
ఢిల్లీకి చెందిన వాన్‌గార్డ్ డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు దేశీయంగా ఈ కిట్‌ను అభివృద్ధి చేశారు. కరోనా వైరస్ తీవ్రత, దాని న్యూక్లియోక్యాప్‌సైడ్ ప్రొటీన్లను ఈ డిప్‌కొవాన్ కనిపెడుతుంది. వైరస్ తీవ్రత స్థాయిని 97 నుంచి 99 శాతం వరకు ఈ కిట్ పసిగట్టగలదని డీఆర్‌డీఓ వెల్లడించింది.
 
సంబంధించి డీఆర్డీఓ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం  డిప్‌కోవాన్ ఇతర వ్యాధులతో ఎటువంటి క్రాస్ రియాక్టివిటీ లేకుండా శరీరంలో ప్రతిరోధకాలు ఉన్నాయో లేదో పరీక్షించి తెలుసుకోగలదు. దీని కోసం కేవలం 75 నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది. ఈ కిట్ 18 నెలలు పనిచేస్తుంది. 
 
ఈ కిట్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా గత నెలలోనే ఆమోదించింది. 2021 మేలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ), ఆరోగ్య&కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల నుంచి విక్రయపంపిణీలకు సంబంధించి కూడా ఆమోదం లభించింది.
 
డీప్‌కోవాన్ జూన్ మొదటి వారం నుంచి వాన్ గార్డ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా మార్కెట్లోకి రానుంది. తొలిగా 100 కిట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ తరువాత నెలకు 500 కిట్ల చొప్పున అభివృద్ధి చేయనున్నట్లు డీఆర్డీవో తెలిపింది. అయితే తొలుత అందుబాటులోకొచ్చే కిట్‌ల ద్వారా 10వేల మందికి కోవిడ్ పరీక్షలు చేసేందుకు వీలుంటుందని, ఒక్కో పరీక్షకు కేవలం రూ.75 మాత్రమే ఖర్చవుతుందని డీఆర్డీవో వెల్లడించింది.
 
 కాగా  ఇప్పటిరకు కచ్చితమైన ఫలితాలనిచ్చే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం దాదాపు రూ.700పైగా చెల్లించుకోవాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు డీఆర్డీవో టెస్ట్ కిట్ అందుబాటులోకొస్తే మరింత తక్కవ ఖర్చుతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీలుంటుంది.