కేరళ సీఎంగా విజయన్‌ ప్రమాణస్వీకారం

కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. కొవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి అత్యంత నిరాడంబరంగా తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ విజయన్‌ చేత రెండోసారి సీఎంగా ప్రమాణం చేయించారు.
కాగా విజయన్‌తో పాటు 21 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే రాష్ట్రంలో గతేడాది కరోనా కట్టడిలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలకపాత్ర పోషించిన కేకే. శైలజకు మంత్రి వర్గంలో చోటుదక్కలేదు. ఆమె స్థానంలో వీణా జార్జ్‌కు ఆరోగ్య శాఖ కేటాయించారు.
ఇక పినరయి విజయన్‌ అల్లుడు మహ్మద్‌ రియాస్‌కు పబ్లిక్‌ అండ్‌ టూరింజ్‌ శాఖను అప్పగించారు. ఇక కేబినెట్‌లో చేరిన వారంతా అంద‌రూ కొత్త‌వారే. ఈ సంద‌ర్భంగా సీఎం విజ‌యన్‌తో పాటు మంత్రుల‌కు గ‌వ‌ర్న‌ర్, ఇత‌ర ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్- యూడీఎఫ్ నేతలు సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్దిమంది మాత్రమే హాజరు కావాలంటూ నిన్న కేరళ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
 కాగా మే2న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని మొత్తం 140 సీట్లకు గాను, 99 సీట్లను ఎల్డీఎఫ్‌ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష యూడీఎఫ్‌ 41 స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి గెలవదనే సంప్రదాయాన్ని చెరిపేసిన విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.