బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా తీర్పు వెలువడింది.
భారత దేశంలోని మాల్యా ఆస్తులపై తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవడానికి ఈ కన్సార్షియంలోని బ్యాంకులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దివాలా పిటిషన్లో దీనికి సంబంధించిన సవరణలు చేసేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.
దీంతో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం మాల్యాకు ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు ఓ అడుగు ముందుకు పడింది. బ్యాంకుల కన్సార్షియానికి అనుకూలంగా చీఫ్ ఇన్సాల్వెన్సీస్ అండ్ కంపెనీస్ కోర్టు (ఐసీసీ) జడ్జి మైఖేల్ బ్రిగ్స్ తీర్పు చెప్పారు.
తమ సెక్యూరిటీ హక్కులను వదులుకోవడాన్ని నిరోధించే పబ్లిక్ పాలసీ ఏదీ లేదని స్పష్టం చేశారు. మాల్యా దివాలా తీసినట్లుగా ఆదేశాలు ఇవ్వడానికి మద్దతుగా, వ్యతిరేకంగా జూలై 26న తుది వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఈ విచారణ వర్చువల్ పద్ధతిలో జరిగింది.
ప్రజలు మర్చిపోయే వరకు సాగదీయాలని మాల్యా ప్రయత్నిస్తున్నారని బ్యాంకులు ఆరోపించాయి. తాము దాఖలు చేసిన దివాలా పిటిషన్ను పరిష్కరించాలని కోరాయి. జస్టిస్ బ్రిగ్స్ ఇచ్చిన తీర్పులో, బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్ను సవరించేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘‘దివాలా ఆదేశాలు జారీ అయ్యే సందర్భంలో, తమకుగల సెక్యూరిటీని అమలు చేసే హక్కుగల పిటిషనర్లు (బ్యాంకులు), దివాలా తీసినవారి రుణదాతలందరి ప్రయోజనం కోసం అటువంటి ఏదైనా సెక్యూరిటీని వదులుకోవడానికి అంగీకరిస్తున్నారు’’ అని సవరించేందుకు అనుమతిస్తున్నట్లు తీర్పు చెప్పారు. పిటిషనర్లు తమ సెక్యూరిటీని వదులుకోవడాన్ని నిరోధించే చట్టపరమైన నిబంధనలేవీ లేవని ఈ తీర్పులో పేర్కొన్నారు.
More Stories
మసాలా సుగంధ ద్రవ్యాలపై దేశవ్యాప్తంగా తనిఖీలు
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు