ఏపీలో 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు

ఏపీలో 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పలు ఆస్పత్రులపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సోదాలు చేసింది. పలు ఆస్పత్రుల్లో అవకతవకలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అధిక చార్జీలు, పేషెంట్ల సంఖ్యపై తప్పుడు సమాచారం, రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల దుర్వినియోగం, అనుమతి లేకుండా కోవిడ్ చికిత్స వంటి అవకతవకలను గుర్తించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పేర్కొన్నారు.
చరిత్ర ఆస్పత్రి (ఏలూరు), ఆశా ఆస్పత్రి (అనంతపురం), ఎస్.ఆర్.ఆస్పత్రి (విశాఖపట్నం), ఎన్ఆర్ఐ ఆస్పత్రి (బీమిలి), రమ్య ఆస్పత్రి (విశాఖపట్నం), అచ్యుత ఎన్ క్లేవ్ (విజయవాడ), శ్రీరామ్ ఆస్పత్రి (విజయవాడ), విశ్వాస్ ఆస్పత్రి (గుంటూరు), డాక్టర్ ప్రసాద్ ఆస్పత్రి (పీలేరు)లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెమిడిసివర్ ఇంజక్షన్ల కుంభకోణం జరిగింది. కోవిడ్ రోగులకు అవసరమైన రెమ్ డెసివీర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అధిక రేట్లకు అమ్మిన 10 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 13 రెమిడిసివర్ ఇంజక్షన్లు, రూ. 40 వేల నగదు, మూడు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.