ఇండియన్ కోవిడ్-19 వేరియంట్ అనడం పట్ల అభ్యంతరం 

ఇండియన్ కోవిడ్-19 వేరియంట్ 44 దేశాల్లో కనిపించిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  ఈ వేరియంట్‌ను డబ్ల్యూహెచ్ఓ ‘ఇండియన్’ అని వర్గీకరించలేదని తెలిపింది. ఈ అంశంపై విడుదల చేసిన నివేదికలో ‘ఇండియన్’ అనే పదాన్ని డబ్ల్యూహెచ్ఓ వాడలేదని కేంద్ర ప్రభుత్వం  స్పష్టం చేసింది.

డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన నివేదికలో B.1.617 వేరియంట్ ప్రపంచానికి ఆందోళనకరమని తెలిపింది. అయితే చాలా వార్తా కథనాలు ఈ రకాన్ని ‘ఇండియన్ వేరియంట్’గా అభివర్ణిస్తున్నాయి. ఇది నిరాధారమని, ఎటువంటి ప్రాతిపదికలేనిదని కేంద్ర ప్రభుత్వం వివరించింది. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో గుర్తించినవాటి తర్వాత ఆందోళన కలిగించే నాలుగో వేరియంట్ ఇది అని తెలిపింది. ఇది ఒరిజినల్ వైరస్ కన్నా చాలా సులువుగా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తుండటం వల్ల దీనిని ఈ జాబితాలో చేర్చినట్లు తెలిపింది.

B.1.617 వేరియంట్‌ను డబుల్ మ్యుటెంట్ అని కూడా పిలుస్తున్నారు. ఇది యాంటీబాడీస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడానికి కారణం ఈ వేరియంటేనని భావిస్తున్నారు. ఈ వేరియంట్‌ను 44 దేశాల్లో దాదాపు 4,500 శాంపిల్స్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది. 

డబుల్ మ్యుటెంట్ వైరస్‌ను 2020 అక్టోబరు 5న మొదటిసారి గుర్తించారు. అది మన దేశంలో విస్తృతంగా వ్యాపించలేదు. మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో మన దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి, ఈ వేరియంట్‌కు మధ్య సంబంధాన్ని  కేంద్ర ప్రభుత్వం రూఢి చేయలేదు. ఇదొక కారణం కావచ్చునని మాత్రమే చెప్పింది. వైరస్‌లో వేరియంట్లు సహజమేనని, కొన్ని రకాలు మిగిలినవాటికన్నా శక్తిమంతంగా ఉండవచ్చునని తెలిపింది. 

కాగా, వైరస్‌లు, వాటి వివిధ రూపాలను అవి మొదట కనిపించిన దేశాల పేర్లతో గుర్తించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. వాటి శాస్త్రీయ పేర్లతోనే ప్రస్తావిస్తున్నామని తెలిపింది. వీటికి ఒకే విధమైన పేరు ఉండటం కోసం అందరూ ఇదే పద్ధతిని అనుసరించాలని కోరింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా విభాగం బుధవారం ఓ ట్వీట్ చేసింది.