డీఆర్డీవో కరోనా ఔషధానికి డీసీజీఐ గ్రీన్‌సిగ్న‌ల్‌

క‌రోనాపై పోరుకు మ‌రో కీల‌క అస్త్రం డాక్ట‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్డీవో) సంధిస్తున్న అస్త్రం. డీఆర్డీవో త‌యారు చేసిన 2-డియాక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔష‌ధ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చింది. 

ఇది స్వ‌ల్ప నుంచి మోస్త‌రు క‌రోనాతో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌పై బాగా ప‌ని చేయనుంది. క‌రోనా పేషెంట్ల‌కు ప్ర‌ధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వాళ్లు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్డీవో ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఇది జెన‌రిక్ మాలిక్యూల్‌, గ్లూకోజ్ అన‌లాగ్ కావ‌డం వ‌ల్ల దీని ఉత్ప‌త్తి చాలా సులువ‌ని, పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుంద‌ని ఆ సంస్థ తెలిపింది. ఇది వాడిన పేషెంట్ల‌లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లో నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు డీఆర్డీవో చెప్పింది. 

ఈ డ్ర‌గ్ పొడి రూపంలో ఉండి, సాచెట్‌ల‌లో వ‌స్తుంది. దీనిని నీళ్ల‌లో క‌లుపుకొని తాగితే చాలు. ఇది వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్డీవో తెలిపింది.

డాక్ట‌ర్ రెడ్డీస్ లేబొరేట‌రీస్‌తో క‌లిసి డీఆర్డీవో ల్యాబ్ అయిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ మెడిసిన్ అండ్ అలైద్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. ఇది క‌రోనా పేషెంట్లు చాలా వేగంగా కోలుకోవ‌డంలో స‌హ‌క‌రిస్తోంద‌ని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో తేలింది. పైగా క‌రోనా పేషెంట్ల‌కు కృత్రిమ‌ ఆక్సిజ‌న్ అవ‌స‌రాన్ని త‌గ్గిస్తుంది.