దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు,రాజనీతిజ్ఞుడు 

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా  పనిచేసిన దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు, రాజనీతిజ్ఞుడు అని ఆయన శతజయంతి సందర్భంగా సామజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సభలో పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. 

జాగృతి మాజీ సంపాదకులు డా. వడ్డే విజయసారధి తెలుగులో వ్రాసిన “పదవులకు వన్నె తెచ్చిన ప్రజ్ఞానిధి దామోదరం సంజీవయ్య” అనే పుస్తకంని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

“ప్రతి వ్యక్తిలో జ్ఞానం,  సమర్థతలు సహజంగా ఉంటాయి, వాటిని వెలికి తీసే గురువులే కావాలని” స్వామి వివేకానందుడు అన్నారు.
ప్రతి కులంలోను సమర్థులైన వారు ఉన్నారు.ఎవరిని కులం పేరున చిన్న చూపు చూడతగదనీ,అంటానితనం పాటించరాదనీ అన్ని కులాల వారికి సమాన గౌరవం,అవకాశాలు కల్పించాలని సామాజిక.  సమరసత వేదిక కోరుకుంటోంది. ,అందులో భాగంగానే  దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు.

కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో  14 ఫిబ్రవరి 1921లో పేద దళిత కుటుంబంలో సంజీవయ్య జన్మించి న్యాయవాద పట్టాను పొందారు. వారు గాంధీజీని చూడలేదు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గోలేదు. అయినా రాజాజీ గుర్తింపుతో 1950లో ఆనాటి తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు అయ్యారు.52-60 లలో రాజాజీ,ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల రెడ్డి, సంజీవరెడ్డి మంత్రి వర్గాల్లో వివిధ శాఖలను మంత్రిగా సమర్థ వంతంగా నిర్వహించారు.

1960-62 ఆ నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేశారు.ఆ నాటి కాంగ్రెస్ లోని అన్ని వర్గాల వారిని మంత్రులుగా తీసుకున్నా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు సంజీవయ్య గారిని ఆ రెండు సంవత్సరాలూ సజావుగా ముఖ్య మంత్రిగా పని చేయనీయ లేదు.

నెహ్రూ,లాల్ బహదూర్ శాస్త్రి,ఇందిరా గాంధీ   మంత్రి వర్గాల్లో కేంద్ర  కార్మిక,పరిశ్రమల మంత్రిగా,రెండు సార్లు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ప్రభుత్వంతో ఎంతో సమన్వయంతో పని చేశారు.కాంగ్రెస్ ముఠా రాజకీయాల వల్లే 1967లో పార్లమెంటు సభ్యునిగా ఓడి పోయారు.ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎవరి పట్ల ఆగ్రహం చూపలేదు.

సామాన్య ప్రజలకు అందు బాటులో ఉండడం, విలక్షణంగా సమస్యల పరిష్కారం, నిరాడంబర జీవనం,
అవినీతి- బంధు ప్రీతికి దూరంగా ఉండడం, తెలుగు, ఆంగ్లంలో మంచి వక్తృత్వము, సాహిత్యంలో మంచి పట్టు, తెలుగు మాతృ భాష పట్ల ఎనలేని శ్రద్ద, సమర్ధ వంతమైన పరిపాలన….ఇలా అనేక సుగుణాలు గల్గిన రాజ నీతిజ్ఞుడు దామోదరం సంజీవయ్య  నేటి రాజకీయ నాయకులకు అన్ని విధాలా మార్గదర్శి అని వక్తలు కొనియాడారు.

డా.జీ.వెంకట రాజం (ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు) డా.దాసరి శ్రీనివాసులు, (అధ్యక్షులు, దామోదరం సంజీవయ్య ఫౌండేషన్) డా.వడ్డీ విజయ సారథి, శ్యామ్ ప్రసాద్ (జాతీయ కన్వీనర్, సామాజిక సమరసత),డా.వంశ తిలక్ ( తెలంగాణ అధ్యక్షులు, సామాజిక సమరసత  వేదిక) తదితరులు  ప్రసంగించారు. నవయుగభారతి ప్రచురించిన ఈ పుస్తకానికి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందేశం పంపారు.