మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్ట్ 

మరాఠా రిజర్వేషన్లపై బుధవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.
ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని, 50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని కోర్టు పేర్కొంది. 1992 మండల్‌ తీర్పులో సుప్రీంకోర్టు విధించిన రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పునః సమీక్షించాల్సిన అవసరం లేదని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
 అయితే, పీజీ మెడికల్‌ కోర్సుల్లో కొత్త రిజర్వేషన్ల చట్టం మేరకు ఇప్పటికే చేపట్టిన ప్రవేశాలు కొనసాగుతాయని తెలిపింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది. దీంతో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనుకున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి చుక్కెదురైంది. విద్య, సామాజికపరంగా వెనుకబడిన వర్గంగా మరాఠా సామాజిక వర్గాన్ని గుర్తిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో విద్యాసంస్ధల్లో ప్రవేశాలు,  ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్‌లు ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇక ఈ చట్టాన్ని సమర్ధించిన బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్‌ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతం మించరాదని, అడ్మిషన్లలో 13 శాతం మించరాదని 2019లో తీర్పునిచ్చింది.

ఈ క్రమంలో రిజర్వేషన్ల అంశం, బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన ఐదుగురు  న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో తీసుకువచ్చిన చట్టం సమానత్వపు హక్కును ఉల్లంఘించేదిగా ఉంది’ అని స్పష్టం చేసింది.

“మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు 50 శాతంగా ఉన్న పరిమితిని ఉల్లంఘించడం సరైనది కాదు. 50 శాతం రిజర్వేషన్లు మించరాదనే 1992 నాటి తీర్పును పునఃపరీక్షించలేం’’ అని స్పష్టం చేస్తూ మరాఠా రిజర్వేషన్లను నిలిపివేసింది.