బీహార్ లో  మే 15 వరకు అష్ట దిగ్బంధనం

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండటంతో బిహార్ వ్యాప్తంగా అష్ట దిగ్బంధనాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం చెప్పారు. లాక్‌డౌన్ ప్రకటించాలని, లేదంటే తాము రంగంలోకి దిగుతామని హైకోర్టు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే నితీశ్ కుమార్ ఈ ప్రకటన చేశారు.

 సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడం కోసం ఆయన సోమవారం మంత్రులతోనూ, ఉన్నతాధికారులతోనూ సమావేశమైన సంగతి తెలిసిందే.

సహచర మంత్రులతోనూ, అధికారులతోనూ సోమవారం చర్చించిన తర్వాత, మే 15 వరకు బిహార్‌లో అష్టదిగ్బంధనం విధించాలని నిర్ణయించినట్లు నితీశ్ కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సవివరమైన మార్గదర్శకాలు, ఇతర కార్యకలాపాలను రూపొందించాలని క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూపును మంగళవారం ఆదేశించినట్లు తెలిపారు. 

బిహార్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించిన సమాచారం ప్రకారం, గడచిన 24 గంటల్లో కొత్తగా 11,407 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది ఈ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయారు.