భద్రత లేకుండా గురుద్వారాకు  ప్రధాని

దేశ రాజధాని ఢిల్లీలోని గురుద్వారా సిస్‌ గంజ్‌ సాహిబ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం సందర్శించారు. ఎలాంటి బందోబస్తు లేకుండా గురుద్వారాకు వెళ్లి, ప్రార్థనలు చేశారు.

 గురు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా ప్రకాశ్‌ పురాబ్‌ గురుద్వారాలో ప్రార్థనలు చేసి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు ఆయన ట్విట్టర్‌ వేదికగా గురు తేగ్‌ బహదూర్‌కు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాలకు చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడ్డారని, ఆయన చేసిన అత్యున్నత తాగం చాలా మందికి బలాన్ని, ప్రేరణ ఇస్తుందని ట్వీట్‌ చేశారు. 

అయితే, షెడ్యూల్‌లో లేని పర్యటన కావడంతో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గురుద్వారాకు వెళ్లే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.