గుజరాత్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి

గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారుచ్‌లోని పటేల్‌ వెల్ఫేర్‌ కొవిడ్‌ హాస్పిటల్‌లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని అధికారులు తెలిపారు. 
 
కొవిడ్‌ వార్డులో చికిత్స తీసుకుంటున్న 12 మంది రోగులు మంటలు అంటుకొని, భారీగా వ్యాపించిన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారని భారుచ్‌ ఎస్పీ రాజేంద్ర సింహ్‌ తెలిపారు. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు.
 
భారుచ్‌-జంబుసర్‌ రహదారిపై ఉన్న నాలుగు అంతస్థుల భవనంలో హాస్పిటల్‌ ఉండగా.. దీన్ని ఓ ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కొవిడ్‌ వార్డులో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్‌ సంసియా తెలిపారు. 
 
గంటలోపు మంటలు అదుపులోకి తీసుకువచ్చామని, సుమారు 50 మంది రోగులను, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని పేర్కొన్నారు. వారందరినీ సమీపంలో ఉన్న హాస్పిటల్స్‌కు తరలించినట్లు వివరించారు. అయితే మంటలు చెలరేగేందకు ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదని అధికారులు చెప్పారు.