కరోనా బాధితుల సేవలో నేవీ

 దేశ సైనిక‌ద‌ళం క‌రోనాపై పోరాటానికి న‌డుం బిగించింది. కొవిడ్ బాధితుల‌కు చికిత్స అందించేందుకు త‌మ‌వంతు సాయం చేస్తామ‌ని, వెంట‌నే ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెనువెంట‌నే భార‌త నావికా ద‌ళం త‌మ హాస్ప‌ట‌ళ్ల‌ను పౌర సేవ‌ల కోసం సిద్ధం చేసి అందుబాటులోకి తెచ్చింది.

ప‌శ్చిమ నేవి క‌మాండ్ ప‌రిధిలోని మూడు ద‌వాఖాన‌లైన గోవా ఐఎన్‌హెచ్ఎస్ ప‌తాంజ‌లి, ముంబైలోని క‌ర్వార్‌, సందాని ద‌వాఖాలు కొవిడ్ బాధితుల‌కు చికిత్స అందించేందుకు ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌ను సిద్ధం చేసిన‌ట్లు నేవీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ముంబై నుంచి స్వ‌గ్రామాల‌కు వెళ్ల‌లేని వ‌ల‌స కార్మికులు ఉండేలా నేవీ ప‌రిస‌రాల్లో మౌలిక వ‌స‌తుల‌తో ఏర్పాట్లు సైతం చేశారు.

కొవిడ్ ప‌రిస్థితుల‌పై నేవీ అధికారులు ఎప్ప‌టిక‌ప్ప‌డు క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రుగుపుతున్నారు. ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా,  క‌ర్వార్‌లో వ‌ల‌స కార్మికుల‌కు ఇబ్బంది లేకుండా నేవీ అధికారులు అండ‌గా ఉంటున్నారు. 1500 మందికి నిత్యావ‌స‌రాల‌తోపాటు రేష‌న్‌, ప్రాథ‌మిక‌ ఆరోగ్య సేవ‌ల‌ను సైతం అందిస్తున్నారు.

గ‌తేడాది కొవిడ్ బాధితుల‌కు తొలిసారి సేవ‌లందించిన నేవీ ద‌వాఖాన‌గా గుర్తింపు సాధించిన ఐఎన్‌హెచ్ఎస్ ప‌తాంజ‌లి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బాధితుల‌కు సేవ‌లందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. తొలిద‌శ క‌రోనా స‌మ‌యంలో క‌మ్యూనిటీ కిచెన్‌ల‌ను ఏర్పాటు చేసి సేవ‌లందించిన గోవాలోని నేవీ బృందం ఈ సారి సైతం అదే త‌ర‌హా సేవ‌ల‌కు సంసిద్ధ‌మ‌య్యారు.

గోవాలోని ఇండియ‌న్ నేవీ ద‌వాఖాన‌ జీవంతిలో కొవిడ్ బాధితుల‌కు పడకలను ఏర్పాటు చేయ‌డంతోపాటు ప్రధాన కార్యాల‌యం నుంచి వ‌చ్చే అభ్య‌ర్థ‌న‌ల‌కు అనుగుణంగా ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించేందుకు నేవీ సిబ్బంది పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ఉంది.

కొవిడ్ ప్రభావిత ప్రాంతాలకు వైద్య పరికరాలను రవాణా చేసేందుకు, కమ్యూనిటీ కిచెన్లతో పేదలకు సాయం చేసేందుకు అవ‌స‌ర‌మైన‌ ఇతర సాంకేతిక సాయం అందించేందుకు గుజరాత్ నేవీ ప్రాంత పాల‌నా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు.

భ‌ద్ర‌తా ద‌ళాల వైద్య సేవ‌ల డైరెక్టరేట్ జనరల్ ఆదేశాల మేరకు దేశంలోని ఆయా కొవిడ్ సంరక్షణ కేంద్రాల్లో వైద్య‌ సేవ‌లందించేందుకు శిక్షణ పొందిన వైద్య, వైద్యేత‌ర‌ సిబ్బందిని పంపేందుకు ముంబై నేవీకి చెందిన అశ్వినీ ద‌వాఖాన‌ బృందాల‌ను సిద్ధం చేసింది.