ఆక్సిజన్ కొరతపై మోదీ కీలక సమీక్ష 

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
‘‘ దేశంలో తగినంత మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరా ఉండేలా ప్రధాని మోదీ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యం, రవాణా, ఉక్కు శాఖల నుంచి మోదీ ఇన్‌పుట్స్ కూడా తీసుకున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ప్రధాని నొక్కి చెప్పారు’’ అని ప్రధాని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. 
 
దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగా ఉందని, ఆ రాష్ట్రాల్లో రాబోయే 15 రోజుల్లో ఆక్సిజన్ సరఫరా గురించి కూడా మోదీ సమీక్షించారని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. డిమాండ్‌కు అనుగుణంగా చికిత్స కోసం వినియోగించే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని మోదీ అధికారులకు సూచించారు. 
 
అలాగే ప్రతి ప్లాంట్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని సూచించారు. ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లపై నిరంతర నిఘాను ఉంచాలని మోదీ సూచించారు.