తెలంగాణలో కరోనా ఆంక్షలు…. హైకోర్టు సూచన

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌టిపిసిఆర్‌ టెస్టులు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించాలని, క్లబ్బులు, పబ్బులు, సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. 

దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆర్‌టిపిసిఆర్‌ టెస్టులు తక్కువగా చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. వాటి సంఖ్యను భారీగా పెంచాలని ఆదేశించింది. మద్యం దుకాణాలు, సినిమా థియేటర్లు, క్లబ్బుల్లో రద్దీపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 

మద్యం దుకాణాలు కరోనా వనరులుగా మారాయని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కరోనా నిబంధనల ఉల్లంఘనలపై ఎన్ని కేసులు నమోదు చేశారో కూడా తెలపాలని హైకోర్టు కోరింది. 

కరోనా నిబంధనల ఉల్లంఘనలపై సుమారు 22 వేల కేసులు నమోదు చేసినట్లు డిజిపి నివేదికలో వెల్లడించారు. భౌతిక దూరం పాటించని వారిపై 2,416 కేసులు, రోడ్లపై ఉమ్మివేసిన వారిపై 6 కేసులు నమోదు చేశామని తెలిపారు. అయితే, నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16 లక్షల మందికే జరిమానా? అని హైకోర్టు ప్రశ్నించింది. పాతబస్తీ ప్రాంతంలో రెండ్రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారని వ్యాఖ్యానించింది. సీరో సర్వైలెన్స్‌ ఆరు వారాల్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. సీరో పరీక్షలు పూర్తయ్యాక నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

కంటైన్‌మెంట్‌ జోన్లు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌ ఏర్పాట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఏప్రిల్‌ 14లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ 19కి వాయిదా వేసింది.