నన్ను హత్య చేసేందుకు కుట్ర

‘నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజరు భల్లాకు అందజేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేసినందుకు తనకు చాలా మంది ఫోన్‌ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని తెలిపారు. తన కోసం కడప బ్యాచ్‌ను దించాలనుకుంటున్నారని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపి విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలంటూ సిబిఐ డైరెక్టరుకు లేఖ రాసినట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు.

అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేసేందుకు వీలుగా జగన్, ఆయన సహనిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు, హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ అరాచకాలకు పాల్పడుతున్నారని.. చిన్న చిన్న సాకులతో కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు.

బెయిల్‌ ద్వారా సంక్రమించిన స్వేచ్ఛను జగన్‌ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బెయిల్‌ ఎందుకు రద్దుచేయాలో వివరిస్తూ 26 అంశాలను, ఉప అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక సాక్షులను ప్రభావితులను చేస్తున్నారని కోర్టుకు రఘురామకృష్ణరాజు తెలిపారు.