రాధిక, శరత్‌కుమార్‌కు జైలు

సినీనటులు రాధిక, శరత్‌కుమార్‌ దంపతులతోపాటు మరో వ్యక్తికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష, రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు విచారించేందుకు చెన్నై కలెక్టరేట్‌ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎన్‌.అలీసియా బుధవారం తీర్పు వెలువరించారు. 
 
సమత్తువ మక్కల్‌ కట్చి పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌, రాధిక, లిస్టిన్‌ స్టీఫెన్‌.. మ్యాజిక్‌ ఫ్రేమ్స్‌ కంపెనీలో భాగస్వాములు. ఈ కంపెనీ రేడియన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సినీ ఫైనాన్సింగ్‌ కంపెనీ నుంచి రూ.1.50 కోట్లు అప్పు తీసుకుంది. అనంతరం ఆ అప్పు తీర్చేందుకు రెండు చెక్కులు అందజేసింది. 
 
అదే కంపెనీ నుంచి శరత్‌కుమార్‌ మరో రూ.50 లక్షల రుణం తీసుకొని, రూ.10 లక్షల చొప్పన 5 చెక్కులు అందజేశారు. అవన్నీ బౌన్స్‌ అవడంతో 2018లో ఈ ముగ్గురిపై కేసు నమోదైంది. కాగా, వివాదాన్ని పరిష్కరించుకుంటామని, శిక్షను నిలిపివేయాల్సిందిగా శరత్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది.