అమిత్‌షా, యోగిలను చంపేస్తాం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ లను చంపేస్తామంటూ సిఆర్‌పిఎఫ్‌కు బెదిరింపు ఇమెయిల్ రావడం కలకలం సృష్టించింది. ఇందుకోసం 11 మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నట్లు ఆ ఆగంతకులలు ఇమెయిల్‌లో పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా ప్రార్థనాస్థలాలు, కీలక ప్రాంతాలపైన కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ బెదిరింపు ఇమెయిల్ మూడు రోజుల క్రితం ముంబయిలోని సిఆర్‌పిఎఫ్ ప్రధాన కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. 
 
దీన్ని మహారాష్ట్రతో పాటు కేంద్రప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలకు పంపించినట్లు సిఆర్‌పిఎఫ్ డిజిపి కుల్దీప్ సింగ్ వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, ఆయా సంస్థల ఆదేశాల మేరకు తాము ముందుకెళ్తామని ఆయన చెప్పారు.
 
ఇటీవల యుపిలోని పోలీసు ఎమర్జెన్సీ సర్వీస్ 112కు కొందరు దుండగులు ఫోన్ చేసి 24 గంల్లో సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఎకె47తో కాల్చి చంపుతామంటూ ఇలాగే బెదిరింపులకు పాల్పడ్డారు.ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆగ్రాకు చెందిన ఓ మైనర్‌ను అరెస్టు చేశారు.