త‌మిళ‌నాడులో రూ 428 కోట్ల న‌గ‌దు, బంగారం సీజ్

త‌మిళ‌నాడులో భారీ స్థాయిలో న‌గ‌దు, బంగారంతో పాటు ఖ‌రీదైన ఇత‌ర వ‌స్తువులను సీజ్ చేశారు. వాటి మొత్తం విలువ సుమారు 428 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రేపు త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్ర‌మంతటా ఒకే ద‌శ‌లో పోలింగ్ జ‌ర‌నున్న‌ది.
 
 ఈ నేప‌థ్యంలో అక్క‌డ జ‌రిగిన ఐటీశాఖ అధికారుల సోదాల్లో సుమారు 428 కోట్లు విలువైన మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో సుమారు 225.5 కోట్ల న‌గ‌దు ఉన్న‌ది. ఇక బంగారంతో పాటు ఇత‌ర విలువైన వ‌స్తువుల ఖ‌రీదు సుమారు రూ 176 కోట్లు ఉంటుంద‌ని భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన ఐటీ సోదాల్లో ఆ మొత్తం ల‌భ్యం అయిన‌ట్లు తెలుస్తోంది. 
 
గ‌త కొన్ని రోజుల క్రితం చెన్నైతో పాటు ఇత‌ర న‌గ‌రాల్లోనూ ఐటీశాఖ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే ఎవ‌రి నుంచి, ఎక్క‌డ నుంచి, ఎంతెంత స్వాధీనం చేసుకున్నారో ఇంకా అధికారులు స్ప‌ష్టంగా వెల్ల‌డించ‌లేదు. 
 
కానీ ఇటీవ‌ల డీఎంకే నేత ఇండ్ల‌ల్లో ఐటీ దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. డీఎంకే నేత స్టాలిన్ అల్లుడు శ‌బ‌రీశ‌న్‌తో పాటు వేలూ ఇంట్లో ఐటీ త‌నిఖీలు జ‌రిగాయి.రాణిపేట్ జిల్లాల్లో సుమారు 92 ల‌క్ష‌లు, థౌజెండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1.23 కోట్ల‌, సేలం నుంచి 1.15 కోట్ల న‌గ‌దును అధికారులు సీజ్ చేశారు.