ఛత్తీస్‌గఢ్ సీఎంకు అమిత్ షా ఫోన్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌కు ఫోన్ చేశారు. బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ సమీపంలో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ ఘటనపై ఆరా తీశారు. ఈ ఎన్‌కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులుకావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఈ ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత 21 మంది భద్రతా దళాల సిబ్బంది ఆచూకీ కనిపించడం లేదు. వీరిలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది. అమిత్ షా ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో జరిగిన పోరాటంలో అమరులైన భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలకు, త్యాగాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. వీరి పరాక్రమాన్ని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని తెలిపారు. 

అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాంతి, అభివృద్ధిలకు శత్రువులుగా వ్యవహరిస్తున్నవారితో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఎన్‌కౌంటర్లో దాదాపు 30 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితిని సమీక్షించాలని అమిత్ షా కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌‌ కుల్‌దీప్ సింగ్‌ను ఆదేశించారు. వెంటనే కుల్‌దీప్ సింగ్ ఛత్తీస్‌గఢ్ చేరుకుని, భద్రతా దళాల కార్యకలాపాలను సమీక్షించారు.