ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా జర్నలిస్టులు 

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా జర్నలిస్టులనూ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జర్నలిస్టులందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా కరోనా వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. 

‘కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న జర్నలిస్టులకు అండగా ఉంటాం. జర్నలిస్టులందరికీ వయసుతో సంబంధం లేకుండా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తాం’ అని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ ఓ ప్రకనటలో పేర్కొన్నారు.

కరోనా కష్టకాలంలో జర్నలిస్టులు నిరంతరం విధులు నిర్వర్తిస్తూ.. ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేస్తూ, వైరస్‌ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే జర్నలిస్టుల సేవలను గుర్తించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వారిని ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా ప్రకటించింది. 

అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇస్తుండగా.. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది.