టిడిపిలో ముసలం … జ్యోతుల నెహ్రూ `రాజీనామా’

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో ముసలం రేపుతున్నది. ఈ  వ్యతిరేకిస్తూ టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు. టీడీపీ అధిష్టానం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం నిరాశ కలిగించిందని ఈ సందర్భంగా చెప్పారు. 

అయితే రాష్ట్ర  ఉపాధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాత్రమే కొనసాగుతానని ప్రకటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని జ్యోతుల నెహ్రూ భరోసా ఇచ్చారు.

 టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సైతం చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు. శుక్రవారం నాటి పొలిట్ బ్యూరో సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల బహిష్కరణపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందని సూచించారు. 

ఈ నిర్ణయం వల్ల నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని.. అయినా ఆగినచోటు నుంచే ప్రారంభిస్తున్నారని ఎస్ఈసీపైనే విమర్శలు గుప్పించారు. గెలిచినా గెలవకపోయినా బరిలో నిలవడం మన బాధ్యత నిర్వర్తించాలని హితవు పలికారు.

అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని, ఎస్‌ఈసీ తీరును తప్పుబడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోక పోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పడంలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

మరోవంక,  పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించినంత మాత్రాన తాము ఎన్నికల బరిలోంచి తప్పుకోమని విశాఖ జిల్లా రావికమతం మండల టీడీపీ నాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మేడివాడలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉంటారని ధిక్కార స్వరం వినిపించారు.