ఇక దేశ వ్యాప్తంగా ఒకే రవాణా పర్మిట్ 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్‌ నేషన్‌– వన్‌ పర్మిట్‌’లో భాగంగా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒకే రవాణా పర్మిట్ విధానాన్ని అమలు చేయనున్నది. రాష్ట్రాలు మారినప్పుడల్లా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పర్యాటక పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు మొదలుకొని బస్సుల వరకు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు.

సాధారణంగా పెళ్లిళ్లు, వేడుకలు, తీర్థయాత్రలకు వెళ్లే వారికోసం రవాణాశాఖ ఇప్పటివరకు టూరిస్టు పర్మిట్లు ఇస్తోంది. కాంట్రాక్టు క్యారేజీలుగా తిరిగే వాహనాలు మాత్రం రాష్ట్ర, అంతర్రాష్ట్ర పర్మిట్లపై తిరుగుతున్నాయి. ప్రైవేట్‌ బస్సులకు ఇచ్చే ఈ పర్మిట్ల వల్ల రవాణా శాఖకు భారీగా ఆదాయం లభిస్తుంది. 

కొత్తగా అమల్లోకి రానున్న వెసులుబాటు వల్ల ప్రైవేట్‌ బస్సులు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించి టూరిస్టు పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు సాగిస్తాయి. ఒక్కసారి పన్ను చెల్లిస్తే ఏడాది పాటు వాహనాలు నడుపుకోవచ్చు.

ఈ పర్మిట్ల కోసం 9 సీట్ల కంటే తక్కువ సామర్థ్యమున్న నాన్‌ ఏసీ వాహనమైతే ఏడాదికి రూ.15 వేలు, ఏసీ వాహనమైతే రూ.25 వేల చొప్పున చెల్లించాలి. 10 మంది ప్రయాణికులకు తక్కువ కాకుండా.. 20 మందికి మించకుండా తిరిగే నాన్‌ ఏసీ మినీ బస్సులు ఏడాదికి రూ.50 వేలు, ఏసీ మినీ బస్సులు రూ.75 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 

23 సీట్లకంటే ఎక్కువ ఉన్న నాన్‌ ఏసీ బస్సులు టూరిస్ట్‌ పర్మిట్‌ కోసం ఏడాదికి రూ.2 లక్షలు, ఏసీ బస్సులు రూ.3 లక్షల చొప్పున ఫీజు చెల్లించి పర్మిట్లు తీసుకోవచ్చు. టూరిస్ట్‌ పర్మిట్‌ తీసుకున్న వాహనాలు టోల్‌ట్యాక్స్, ఇతర చార్జీలన్నీ యథావిధిగా చెల్లించాల్సి ఉంటుంది.