మాజీ ప్రధాని దేవేగౌడకు కరోనా పాజిటివ్‌

మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు ఆయన సతీమణి చెన్నమ్మ కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. ఈ విషయాన్ని మాజీ ప్రధాని బుధవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మహమ్మారి బారినపడడంతో కుటుంబ సభ్యులంతా స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తమను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడొద్దని సూచించారు. మాజీ ప్రధానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కర్ణాటక వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా వైద్యులను సంప్రదించి, ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తానన్నారు. ఆయన, చెన్నమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొనసాగుతున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తిరోజు 50 వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కూడా దేశంలో 53,480 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది.

కాగా, గ‌డిచిన 24 గంట‌ల్లో న‌మోదైన 53,480 కొత్త కేసుల‌లో 84.73 శాతం కేసులు కేవ‌లం ఎనిమిది రాష్ట్రాల నుంచే న‌మోద‌య్యాయి. మొత్తం కొత్త కేసుల‌లో మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాలకు చెందిన‌వారే 85 శాతం మంది ఉన్నార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 27,918 మందికి క‌రోనా సోకిన‌ట్లు వెల్ల‌డించింది.

ఇలా  ఉండగా,సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేస్తున్న‌ ఆక్స్‌ఫర్డ్ -ఆస్ట్రాజెనికా వారి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కొవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్ (వినియోగానికి నిలువ ఉంచ‌ద‌గిన కాలం)ను ప్ర‌స్తుతం ఉన్న ఆరు నెల‌ల నుంచి తొమ్మిది నెల‌ల‌కు పొడిగిస్తున్న‌ట్లు దేశంలోని ప్ర‌ధాన‌ ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ అయిన సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ (సీడీఎస్‌సీఓ)  తెలిపింది.