బంగ్లాకు 12 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల బహుకరణ 

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఐదు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు దేశాల ఉన్నతాధికారులు భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ హసీనాకు  12 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులకు సంబంధించిన ఒక బాక్సును  బహూకరించారు.

ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఉపయోగపడతాయని ఇరు దేశాల ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటన శనివారం ముగిసింది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా బంగ్లాదేశ్‌కు చెందిన 50 మంది పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ ఆహ్వానించారు. అంతకుముందు తుంగీపారాలోని ‘బంగాబందు షేక్ ముజీబూర్ రెహ్మాన్’ సమాధి వద్ద నరేంద్రమోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.

తన రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. నైరుతి షాట్ఖిరా, గోపాల్‌గంజ్‌లోని జెషోరేశ్వరి, ఒరకాండి దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. భారత్‌లో కొవిడ్-19 మహమ్మారి సంభవించిన ఏడాది తరువాత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌కు బయలుదేరారు.

బంగ్లాదేశ్‌ 50 వ వార్షికోత్సవ వేడుకల్లో, షేక్ ముజీబుర్ రెహ్మాన్ 100 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముజీబుర్‌ రహ్మాన్‌ శతజయంతి బంగారు, వెండి నాణేలను ప్రధాని మోదీకి షేక్‌హసీనా బహూకరించారు. అంతకుముందు 109 అంబులెన్సులను షేక్‌ హసీనాకు అందజేశారు.

 కాగా,తీస్తా నదీ జలాల పంపకంపై బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై బంగ్లా ప్రధాని హసీనాతో రెండు రోజుల పర్యనటలో భాగంగా మోదీ చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ  కార్యదర్శి హర్షవర్థన్‌ ష్రింగ్లా వెల్లడించారు. ఫెని నదీ జలాల పంపిణీ ముసాయిదాను రూపొందించాలని షేక్‌ హసీనాను మోదీ కోరారని ఆయన చెప్పారు.

రెండు దేశాలు 56 నదుల జలాలను పంచుకుంటున్నాయి. మున్ముందూ కూడా ఇదే సహకారం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. తీస్తా సహా నదీ జలాల విభజనపై రెండు దేశాల ఉన్నతాధికారుల మధ్య ఇటీవలే ఢిల్లీలో జరిగిన భేటీ ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. 

సిక్కింలో ప్రారంభమయ్యే తీస్తా నది పశ్చిమబెంగాల్‌ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో ప్రవేశించడానికి ముందు బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఈ నదీ జలాల పంపకంపై 2011లో కుదిరిన ఒప్పందం పశ్చిమబెంగాల్‌ సీఎం మమత అభ్యంతరాలతో అమలు కాకుండా నిలిచిపోయింది. బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని మోదీ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.