ఏపీలో ఉధృతంగా కరోనా మహమ్మారి 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 758 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, నలుగురు మృతి చెందారని గురువారం వైద్య అధికారులు తెలిపారు. చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 895879కు చేరింది. ప్రస్తుతం 3469 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 885209కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7201కు చేరింది.

కాగా, పోలీసు శాఖలో కరోనా కలకలం రేగింది. నెల్లూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లలో 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజా కేసులతో జిల్లా పోలీస్ శాఖలో మొత్తం 23కి కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య చేరింది. దీంతో స్టేషన్‌కు వెళ్లేందుకు పోలీస్ సిబ్బంది, బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. 

మరోవంక, తెలంగాణలో మంగళవారం 431 కేసులు నమోదవగా.. బుధవారం ఆ సంఖ్య 493కి పెరిగింది. ఈ ఏడాదిలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 138, జిల్లాల్లో 355 కేసులు రికార్డయ్యాయి.