ఫిలిప్పీన్స్ లక్ష్యంగా దూసుకొచ్చిన 200 చైనా నావలు 

తన ధన బలం, సైనిక శక్తి చూపిస్తూ పొరుగున ఉన్న చిన్న దేశాలపై ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తూ మొత్తం దక్షిణ చైనా సముద్రం తనదే అంటూ మొండి వాదనలకు దిగుతున్న చైనా తాజాగా ఫిలిప్పీన్స్ లక్ష్యంగా నావికా విన్యాసాలు చేపట్టింది.

 తన బలప్రదర్శనలకు వేదికగా దక్షిణచైనా సముద్రంలోని జూలియన్ ఫిలిప్పే ద్వీపాన్ని ఎంచుకుంది.  ఈ ద్వీపం తమదేనంటుంది చైనా, కాదు మాదే అంటుంది ఫిలిప్పీన్స్ వాదులాడకు దిగుతున్నాయి. ఈ వివాదం కొనసాగిస్తూనే మార్చి 7న చైనా నావికా దళం ఈ ద్వీపానికి ఏకంగా ఏకంగా 200 బోట్లను పంపించింది.

అవన్నీ చేపలు పట్టడానికి ఉద్దేశించినవేనని చైనా ప్రకటించుకుంది. అయితే..ఫిలిప్పీన్స్ వాదన మాత్రం మరోలా ఉంది.  కాస్తంత జాగ్రత్తగా పరిశీలిస్తే..అవన్నీ సైనిక దాడికి చేసేందుకు సిద్ధం చేసినట్టుగా కనిపిస్తున్నాయని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి డెల్ఫెన్స్ లోరెన్జాన చైనాపై మండి పడ్డారు.

సదరు ద్వీపం ఫిలిప్పీన్స్ ఎకనామిక్ కారిడార్ పరిధిలోకి వస్తుందని  చైనా వర్గాలు సముద్రపు దొంగల దుండగులను పంపించిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో చైనా కూడా వెంటనే స్పందించింది.  తన హక్కుల పరిరక్షించుకోవడమే తన ప్రధాన లక్ష్యమంటూ స్పష్టం చేసింది.

కొన్నేళ్లుగా చైనా తెంపరితనాన్ని భరీస్తూ వచ్చిన ఫిలిప్పీన్స్ 2012లో ఈ వివాదాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తెచ్చింది. దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపాల విషయంలో చైనా దుడుకు వైఖరిని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసింది. దీంతో..చైనాకు కోపం నషాళానికి అంటింది.

ఇక అప్పటి నుంచి ఫిలిప్పీన్స్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇందుకోసం ఫిలిప్పీన్స్ ఎగుమతులను ఎంచుకుంది.  అక్కడి రైతులు తమ ఉత్పత్తులను ప్రధానంగా చైనాకే విక్రయిస్తుంటారు. కాబట్టి.. చైనా వారి ఉత్పత్తులపై రకరకాల వంకలు పెడుతూ దిగుమతి చేసుకోకుండా పేచీలు పెట్టుకుంది. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్ రైతులు నానా కష్టాలూ పడుతున్నారు.

ఈ దెబ్బతో రాజీ మార్గాన్ని ఎంచుకున్న ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అమెరికాకు దగ్గరకామంటూ ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో.. చైనా కొంత మేర శాంతించింది. పైగా,  భారత్ నుంచి ఫిలిప్పీన్స్ రక్షణ కొనుగోళ్లు చేయడం కూడా చైనాకు కోపం తెప్పించింది.

ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలనే లక్ష్యంతో చైనా ఇటీవల ఓ కీలక చట్టాన్ని అమోదించింది. చైనా సముద్ర గస్తీ సేనలకు (కోస్ట్‌గార్డ్) ఈ చట్టం ద్వారా కొన్ని కొత్త అధికారాలు సంక్రమించాయి. దీని ప్రకారం  చైనా తనదిగా చెబుతున్న సముద్ర ప్రాంతంలో విదేశీ నౌకలను కోస్ట్ గార్డ్ కట్టడి చేసేందుకు అధికారం ఉంది.

పరిస్థితులను బట్టి.. విదేశీ నౌకలపై కాల్పులు జరిపేందుకు వాటిని అదుపులోకి తీసుకునేందుకూ కూడా చైనా కోస్ట్ గార్డుకు అధికారం ఉంది. దీంతో..చైనా పొరుగున ఉన్న చిన్న దేశాలు హడలిపోతున్నాయి. సముద్రపు సరిహద్దులపై స్పష్టలేని తరుణంలో చైనా తన నావికా దళం ద్వారా తమ దేశాలకు చెందిన నావలకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి.