జంగల్ మహల్ లో తిరుగులేని బిజెపి ప్రభంజనం 

* ప్యూపిల్స్ పల్స్ సౌజన్యంతో 
పశ్చిమ బెంగాల్ లో 85 శాతం మేరకు హిందూ జనాభా ఉన్న జంగల్ మహల్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూలు తెగలు దాదాపు ఏకపక్షంగా మద్దతు ఇస్తూ ఉండడంతో బిజెపి ఘన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 10 శాతంగా ఉన్న ముస్లింల నుండి  మాత్రమే అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు చెప్పుకోదగిన మద్దతు లభించే అవకాశాలు లేవు. 

ఈ ప్రాంతంలో ఆరు లోక్‌సభ సీట్లు ఉన్నాయి: పురులియా, బంకురా, బిష్ణుపూర్, మెడినిపూర్, జార్గ్రామ్,  ఘటల్. పశ్చిమ మిడ్నపూర్ లో బెంగాలీ హిందువులు రాజకీయంగా ఆధిపత్యం వహిస్తుండగా, గణనీయ ఆదివాసీయులు, మహతో-కుర్మీలు, షెడ్యూల్డ్ కులాల వారు, ముఖ్యంగా బాగ్డేలు, బౌరిలు ఉన్నారు. ఖరగపూర్ లో హిందూ భాషీలు, తెలుగు ప్రజలు కూడా తగినంత సంఖ్యలో ఉన్నారు. అక్కడక్కడా ముస్లింలు కూడా కొద్దీ సంఖ్యలో ఉన్నారు. 

ఝార్గ్రామ్, పురూలియా ప్రాంతంలో మహతో కూర్మిలు తమ విలక్షణమైన సామజిక, రాజకీయ గుర్తింపుతో రాజకీయంగా ఆధిపత్యం వహిస్తున్నారు. వారి తర్వాత ఆదివాసీయులు,  ప్రధానంగా శాంతల్స్, షెడ్యూల్ కులంలో ప్రధానంగా బౌరిస్,  బాగ్డిస్,  బెంగాలీ హిందువులు తమ ఉనికిని చాటుకొంటున్నారు. ముస్లింలు చాల తక్కువగా ఉన్నారు. 

అదేవిధంగా, బంకురా, బిష్ణుపూర్ వద్ద షెడ్యూల్డ్ కులాలలో బౌరిస్,  బాగ్దీలు, బెంగాలీ హిందువులు దాదాపు సమానంగా ఉన్నారు. వారు కాకుండా  సంతల్ తెగల ప్రజలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు. 

క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ప్యూపిల్స్  పల్స్ జంగల్ మహల్ ప్రాంతంలో గల మొత్తం 42 అసెంబ్లీ స్థానాలలో బిజెపి 33 గెల్చుకోగలదని అంచనా వేస్తున్నది. మరో ఐదు స్థానాలను టిఎంసి గెల్చుకొనే అవకాశాలు ఉండగా, మిగిలిన 4 సాధనలలో ఆ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ ఇక్కడ ఒక్క సీట్ కూడా గెల్చుకొనే అవకాశం లేదు.

రాజకీయంగా జంగల్ మహల్ ప్రాంతంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ప్రస్తుతం బిజెపికి నిబద్దత గల ఓటర్లుగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ లో రెండు నెలలపాటు క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి, ఒక నివేదిక ప్రచురించిన హైదరాబాద్ కేంద్రంగా గల ఎన్నికల పర్యవేక్షణ, పరిశోధన సంస్థ ప్యూపిల్స్  పల్స్ వెల్లడించింది.

బెంగాలీ హిందువులు ఈ ప్రాంతంలో కొద్దిగా ఉన్నప్పటికీ వారిలో అత్యధికంగా తృణమూల్ వ్యతిరేకులుగా పేరొందారు. ఇక ముస్లింలు ఎప్పటిలాగే టిఎంసి ఓర్లకు కట్టుబడి ఉన్నారు, కాని ఈ ప్రాంతంలో వారి ఉనికి నామమాత్రంగా ఉంది. జంగల్ మహల్ ప్రాంతంలో సంస్థాగతంగా బిజెపి బలహీనంగా ఉన్నప్పటికీ, ప్రజలకు తెలిసిన నాయకులు లేకపోయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకంగా ఆ పార్టీని తిరుగులేని శక్తిగా చేస్తున్నట్లు భావిస్తున్నారు. 
 
తృణమూల్ కాంగ్రెస్ కు మంచి నాయకత్వం ఉన్నప్పటికీ అవినీతి, నిరుద్యోగం, రాజకీయ ప్రత్యర్థుల పట్ల రాజకీయ హింసకు దిగుతూ ఉండడం కారణంగా ఆ పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నది.  కాంగ్రెస్ కు ఇక్కడ చెప్పుకోదగిన ఉనికి లేకపోగా, సిపిఎం తన ఇమేజ్ ను ప్రజలలో కొంత మెరుగు పరచుకో గలిగినప్పటికీ,  రాజకీయంగా ఆ పార్టీని ఎవ్వరు సీరియస్ గా తీసుకోవడం లేదు. కేవలం ఒక్క సీట్ లో మాత్రమే ఆ పార్టీ ఉనికి కనిపిస్తున్నది. 

బంకురా, పురులియా, ఝార్గ్రామ్ వంటి ప్రాంతాలు రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటి కావడం, దళితులు, ఆదివాసీయులు అధిక సంఖ్యలో ఉంటూ ఉండడంతో ప్రభుత్వ పధకాలు వారికి చేరక పోవడం, స్థానిక టిఎంసి కార్యకర్తల జీవన స్థాయి ఒకేసారి విలాసవంతంగా మారుతూ ఉండడంతో అవినీతి పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. 
 
టిఎంసి వేషధారణ, విలాసవంతమైన జీవనం, విలాసవంతమైన గృహాలు ప్రజలలో అధికార పక్షాన్ని శత్రుపక్షంగా మారుస్తున్నాయి. నిరుద్యోగ్యం తీవ్రమైన సమస్యగా ఉండడంతో ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు ఇక్కడి నుండి ఎద్దఎత్తున వలసలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో రాజకీయ హింస శృతి మించుకున్నటి. 9 సార్లు లోక్ సభకు ఎన్నికయిన సిపిఎం కురువృద్ధుడు బాసుదేబ్ ఆచార్యను  2018 పంచాయతీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా అవమానించినట్లు ఆరోపణలున్నాయి.