కస్తూరిబా విద్యాసంస్థలో రూ 100ల కోట్ల భారీ అవినీతి!

నెల్లూరులోని ఖ్యాతిగాంచిన కస్తూరిదేవి విద్యాసంస్థలో వందల కోట్ల రూపాయల అవినీతిని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా శ్రీమతి శ్రీమతి పోణకా కనకమ్మ ఆశయ సాధన సమితి వెలికి తీసింది. స్వతంత్ర సమరయోధురాలు పొణకా కనకమ్మ వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రజాసేవకు పలు సంస్థల రూపంలో అందజేస్తే, వాటిని పలుకుబడిగల వారు రికార్డులు మాయంచేసి, స్వాహా చేశారని సమితి కన్వీనర్ బి.సురేంద్రనాద్ రెడ్డి ఆరోపించారు. 
 
పలు అక్రమాలు తమ ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానాల ద్వారా వెలుగులోకి రావడంతో, వారిపై ప్రభుత్వం తగు విచారణ జరిపించి, కనకమ్మ నెలకొల్పిన సంస్థల ఆస్తులను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆమె నెలకొల్పిన సంస్థలో కస్తూరిబా బాలికల పాఠశాల, పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమం, జమీన్ రైతు భవన్, రంగా భవన్, కనకమ్మ భవన్ ఉన్నాయి.  

ఆర్టీఐ చట్టం ద్వారా నెల్లూరు పట్టణం లోని ప్రముఖ కస్తూరి దేవి విద్యాసంస్థకు ఎంత స్థలం ఉందొ తెలపాలని అడుగగా వారు సమాధానం చెప్పలేక పోతున్నారు.సమాచారం సకాలంలో ఇవ్వనందున ఖర్చుల కు రూ 5 వేలు చెల్లించవలసిందిగా రాష్ట్ర  సమాచార కమీషన్ ఆదేశించింది. 

అయినప్పటికీ నేటికి ఎంత స్థలం ఉందొ తెలుపలేదు. అక్కడ చదివిన విద్యార్థులు 20 ఎకరాల విస్తీర్ణం ఉంటుందని చెబుతుండగా,  అధికారుల వద్ద సమాచారం లేకపోవడం గమనార్హం. 

యాజమాన్యం తాము నూతన బిల్డింగ్ లు ఏవీ కట్టలేదని సమాచారం ఇచ్చారు. కానీ నూతన బిల్డింగ్ లు ఉన్నాయని కాలేజి అనుమతులు తీసుకోవడం గమనార్హం. మూడు వారాలలో ప్రభుత్వ సర్వేయర్ చే భూమిని కొలిచి దరఖాస్తు దారుణకు సమాచారం ఇవ్వవలసిందిగా కమీషన్
తెలిపినప్పటికి నేటికి కొలతలు వేయలేదని సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

ఆ స్థలం విలువ రూ 2000 కోట్ల  కు పైగా ఉన్నప్పటికీ రికార్డులు లేకపోవడం తో పలు సందేహాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆ విద్యాసంస్థ ఒకప్పుడు 3600 మంది తో రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించగా, నేడు 240 మంది విద్యార్థులు మాత్రమే అక్కడ చదవడం పాఠశాల అభివృద్ధి ఎలా కుంటుపడిపోయిందో అర్ధం అవుతుందని విమర్శించారు. 

ఈ విషయమై నగర పాలక సంస్థ వద్ద ఎటువంటి రికార్డు లు లేవని సమాచారం ఇచ్చారని  పేర్కొంటూ అలాంటప్పుడు పన్నులు వసూలు ఏ ప్రాతిపదికన చేస్తున్నారో తెలపాలని సురేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. యూనివర్సిటీ వారు ఎటువంటి రికార్డులు లేకుండా అనుమతులు ఎలా ఇచ్చారో తెలపాలని నిలదీశారు. 

ఇంకా ఆ విద్యాసంస్థల్లో అనేక అక్రమాలు బయటకొచ్చాయని ఆయన తెలిపారు. అనేక అక్రమ కట్టడాలు నిర్మించి తక్కువ రేట్ కే బాడుగల కు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.  బాడుగగా నెలకు రూ 10,000 మాత్రమే అధికారికంగా తీసుకొంటున్నట్లు లెక్కలు వ్రాస్తూ అనధికారికంగా రూ 1 లక్ష వరకు తీసుకొంటున్నారని ఆరోపించారు. 

అదే విధంగా రోడ్లు, భవనాల శాఖ రోడ్ వెడల్పు నిమిత్తం కోటి రూపాయలకు పైగా నిధులు అందిస్తే, ఆ నిధులు ఏమయ్యాయో లెక్కలు లేవని విస్మయం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి అధికారులు రోడ్ ను తొలగిస్తే నగరపాలక సంస్థ వారు ఆ విద్యాసంస్థకు కోటి రూపాయలు ఇవ్వడము ఏమిటని ప్రశ్నించారు. 

ఈ విద్యాసంస్థలో చోటు చేసుకొంటున్న ఇటువంటి భారీ అవినీతి కార్యకలాపాలపై తగు దర్యాప్తు జరిపించి, వాస్తవాలను వెలికి తీయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు.  ఇటువంటి భారీ అవినీతిని వెలికి తీస్తున్నందుకు తమకు అనేక బెదిరింపు లు కూడా వచ్చాయని, అయినా ప్రజా ప్రయోజనం కోసం నిరంతర పోరాటం చేస్తున్నానని తెలుపుతూ, అందుకు ప్రజల సహకారం
అవసరం అని కోరారు.