ఏడాదిలోగా అన్ని టోల్ ప్లాజాలనూ తొలగిస్తాం

ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తామని, దాని స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు.
 
`ఏడాదిలోపు దేశంలో ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం. ప్రస్తుతం దేశంలో 93 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నార`ని గడ్కరీ చెప్పారు. 
 
మిగిలిన ఏడు శాతం వాహనాలు డబుల్ టోల్ చెల్లిస్తున్నప్పటికీ ఫాస్టాగ్‌ను తీసుకోలేదని పేర్కొన్నారు. టోల్ చెల్లించేందుకు ఫాస్టాగ్‌ను ఉపయోగించని వాహనాలపై దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.
వాహనాలకు ఫాస్టాగ్స్‌ను అమర్చకపోతే టోల్ దొంగతనం, జీఎస్‌టీ ఎగవేత జరుగుతోందని చెప్పారు. 2016లో తొలిసారి ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఫాస్టాగ్‌ల‌ను గ‌త నెల 16 నుంచి త‌ప్ప‌నిస‌రి చేశారు.