తెలంగాణలో పసుపు ప్రత్యేక బోర్డు అవసరం లేదు 

తెలంగాణలో పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ‘‘సుగంధ ద్రవ్యాల బోర్డు 50 ద్రవ్యాలకు సంబంధించి పనిచేస్తోంది. పసుపునకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తే.. మిగతా వాటికీ చేయాల్సి వస్తుంది. అవి అవసరం లేదు. మీకు పసుపు బోర్డు పేరు కావాలి కానీ.. పని కాదనిపిస్తోంది. ఈ విషయంలో రాజకీయం చేయడం సరికాదు’’ అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్‌ రూపాల హితవు చెప్పారు. 
 
ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం మౌఖిక సమాధానం ఇచ్చారు. 50 రకాల సుగంధ ద్రవ్యాల కోసం ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాల బోర్డు ఉందని, అయినా పసుపు కోసం ప్రత్యేకంగా నిజామాబాద్‌ జిల్లాలో సుగంధ ద్రవ్యాల బోర్డు విస్తరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. 

కాగా, పంటల ధరలు తగ్గినప్పుడు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం నుంచి నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరాల్సి ఉంటుందని, అప్పుడు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ పద్ధతిలో పసుపునకు నిధులు కావాలని వినతి వస్తే తప్పకుండా మంజూరు చేస్తామని మీ ఇచ్చారు.  సుగంధ ద్రవ్యాల మండీని కూడా ఏర్పాటు చేశామని, దీని వల్ల ఖమ్మం, వరంగల్‌ జిల్లాలకు సంబంధించిన 5 వేల మంది రైతులు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. 

కాగా, పసుపు సాగులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర  మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2017-18లో 294.56 వేల టన్నులు, 2018-19లో 345.27 వేల టన్నులు, 386.596 వేల టన్నుల పసుపు ఉత్పత్తయిందని వివరించారు.