మెదక్ బిఆర్‌ఎస్ అభ్యర్థిని అరెస్ట్ చేసి విచారణ జరిపించండి

మెదక్ బిఆర్‌ఎస్ అభ్యర్థిని అరెస్ట్ చేసి విచారణ జరిపించండి

మెదక్ బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి.వెంకట్‌రాంరెడ్డిపై బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిజిపికి ఫిర్యాదు చేశారు. శనివారం డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన ఆయన వెంకట్‌రాంరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు. వెంకట్‌రాంరెడ్డి అక్రమ వ్యాపార లావాదేవీలు, నగదు చెల్లింపులు, తదితర అంశాలపై ప్రత్యేక ఐపిఎస్ అధికారిని నియమించి విచారణ జరపాలని డిజిపిని కోరారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా వెంకట్ రామిరెడ్డి ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు లో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చాడని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయం లో వెంకట్ రామిరెడ్డికి సంబందించిన రూ. 3 కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్ మెంట్ ఇచ్చారని అయినా  వెంకట్ రామిరెడ్డి పై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ఎందుకు వెంకట్ రామిరెడ్డి ని కాపాడుతున్నారు? ఎవ్వరు కాపాడుతున్నారు? సమాధానం చెప్పాలని డీజీపీని ఆయన  కోరాను. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ 243/2024 కేసులో అరెస్టు అయిన పోలీస్ అధికారి కిషన్‌రావు మార్చి 9న ఇచ్చిన వాంగ్మూలంలో తాను బిఆర్‌ఎస్ నేత వెంకట్‌రాంరెడ్డికి సన్నిహితుడనని తెలిపారని రఘునందన్‌రావు వివరించారు.

వెంకట్‌రాంరెడ్డి, రాజ పుష్పా కనస్ట్రక్షన్స యజమానులైన ఆయన సోదరులు వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బులను ఎస్‌ఐ ద్వారా ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్లు కిషన్‌రావు తన వాంగ్మూలంలో తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ఎస్‌ఐ సాయికిరణ్ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు.  ఈ వివరాలన్నింటిని డిజిపికి అందజేసిన ఫిర్యాదుతో జత చేశామని రఘునందన్‌రావు పేర్కొన్నారు. వీటి ఆధారంగా, కిషన్‌రావు, ఎస్‌ఐ సాయికిరణ్ వాంగ్మూలం పరిశీలించి వెంకట్‌రాంరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరారు.