తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల నగరా మోగింది. తిరుపతి లోక్ సభ, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. ఏప్రిల్ 17న తిరుపతితో పాటు నాగార్జునసాగర్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 30న నామినేషన్లకు చివరి రోజు కాగా మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది.
గతంలో తిరుపతి లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి బి దుర్గాప్రసాద్ గెలిచారు. ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ స్థానంపై ఫోకస్ పెట్టాయి. అస్త్ర శస్త్రాలు సిద్ధం చేశాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ తిరుపతి లోక్ సభ అభ్యర్థిని ప్రకటించింది.
బీజేపీ కూడా తన అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు అధికార పార్టీ వైసీపీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదు. సీఎం జగన్ వ్యక్తిగత డాక్టర్ గురుమూర్తిని తిరుపతి బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో రెండు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఈ నెల 17న విడుదల కానున్నాయి. ఇంతలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ స్థానంలో గత సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య గెలిచారు. అనంతరం ఆయన అకాల మరణం చెందడంతో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ స్థానం తిరిగి దక్కించుకోవడం కోసం ఆయన పట్టుదలతో సన్నాహాలు చేస్తున్నారు. ఆయన కుమారుడిని ఎన్నికల బరిలో దించేందుకు జానా రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అభ్యర్థిపై కసరత్తులు ప్రారంభించింది. ఇక టీఆర్ఎస్ దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి భార్యను పోటీ చేయించినట్లుగా నాగార్జున సాగర్ ఉపఎన్నికలో నోముల సతీమణిని పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది.
More Stories
7, 8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటన
జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రత్యేక కోర్టు కోరిన సీబీఐ
పోలవరం పునరావాసంకు `ప్రత్యేక సెస్’