దేవాలయాలకు నూతన మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ

దేవదాయ శాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాల మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఇకపై అత్యంత స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.  ఇందులో భాగంగా ఆయన తన క్యాంపు కార్యాలయంలో నూతన మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ప్రారంభించారు. 

ఇందులో దేవాలయాల సమాచారం, ఆన్‌లైన్‌ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్‌ బోర్డు, సిబ్బంది వివరాలు ఉంటాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.

 దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు.  కొత్త విధానం వల్ల భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించవచ్చు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా కూడా ఇ– హుండీకి కానుకలు సమర్పించే అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తొలిసారిగా అన్నవరం దేవాలయంలో ఈ వ్యవస్థ ప్రారంభమైంది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అన్నవరం టెంపుల్‌కు రూ.10,116 ఇ–హుండీ ద్వారా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమర్పించింది. ఈ నెలాఖరుకు మరో 10 ప్రధాన దేవాలయాల్లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ ప్రారంభమవుతుంది.