థౌజండ్ లైట్స్ నుంచి కుష్బూ పోటీ 

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సీనియర్ నటి కుష్బూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. బీజేపీ నేడు విడుదల చేసిన తొలి జాబితాలో ఆమెకు చోటు లభించింది. చెన్నైలోని థౌజండ్ పిల్లర్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగనున్నారు. డీఎంకే నేత డాక్టర్ ఎజిలాన్‌ను ఆమె ఎదురొడ్డబోతున్నారు. 

తనకు టికెట్ దక్కడంపై కుష్బూ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయబోమనని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. అక్కడ కష్టపడి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

గతేడాది  కాంగ్రెస్ పార్టీని వీడిన కుష్బూ సోనియాకు ఘాటు లేఖ రాశారు. పార్టీలో అణచివేత ధోరణి ఎక్కువ అయిపోయిందని దుమ్మెత్తి పోశారు. పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్న కొందరు నాయకులు, క్షేత్రస్థాయితో సంబంధం లేని, ప్రజల గుర్తింపు లేని వారు పార్టీ కోసం నిజాయతీగా పనిచేస్తున్న తనలాంటి వారిని అణచివేస్తున్నారని, పక్కన పెడుతున్నారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌లో చేరడానికి ముందు కుష్బూ డీఎంకేలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక, మాజీ ఐపీఎల్ అధికారి అన్నమలైకి అరవకురుచి నిజయోకవర్గం సీటు కేటాయించగా, బీజేపీ తమిళనాడు చీఫ్ ఎల్ మురుగున్ తరపురమ్ నుంచి, హెచ్ రాజా కరైకుడి నుంచి బరిలోకి దిగుతున్నారు. వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరు సౌత్‌లో కమల్‌ హాసన్‌ను ఎదుర్కోనున్నారు.  

ఇలా ఉండగా, డీఎంకే ఎమ్యెల్యే డా పి సరవనం నేడు చెన్నైలో బిఎజేపిలో చేరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుప్పరంకుండ్రం నియోజకవర్గాన్ని ఈ సారి తనకు కాకుండా సిపిఎంకు కేటాయించడంతో నిరసనగా ఆయన డీఎంకే నుండి వైదొలిగారు. 2019 ఉప ఎన్నికలలో ఆయన ఇక్కడి నుండి గెలుపొందారు. 

తాను ఆరేళ్ళ క్రితం బిజెపి సభ్యుడినని, తిరిగి ఇప్పుడు ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేయడానికి సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, ఇతర పార్టీలతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకేతో కలిసే బీజేపీ పోటీ చేసింది. కానీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి 20 స్థానాల్లో బీజేపీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.