విమానంలో మాస్క్‌లు సరిగా ధరించకపోతే  ప్రయాణీకులను దింపేస్తాం!

విమానంలో మాస్క్‌లు సరిగా ధరించకపోతే లేదా కోవిడ్-19 నిబంధనలను సరిగ్గా పాటించకపోతే ప్రయాణీకులను దింపేస్తామని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ ప్రయాణీకులు  ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తే, ఆ ప్రయాణీకుడిని  ‘విధేయత లేని ప్రయాణీకులు’ గా పరిగణిస్తామని డీజీసీఏ హెచ్చరించింది.
 
 ఒకవైపు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మాత్రం ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ‌(డీజీసీఏ) ఈ చర్యలు తీసుకుంటోంది. 

“విమాన ప్రయాణాన్ని చేపట్టే కొంతమంది ప్రయాణికులు ‘కోవిడ్ -19 ప్రోటోకాల్‌’లకు కట్టుబడి ఉండట్లేదు. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు రాకపోకలు చేసే సమయంలో , విమానాశ్రయంలో ఉన‍్నంతసేపు అన్ని సమయాల్లో మాస్క్‌లను కచ్చితంగా ధరించాల’ని డీజీసీఏ పేర్కొంది.

విమానశ్రయ ప్రాంగణంలో కొంతమంది భౌతికదూరాన్ని పాటించడం లేదని తెలిపింది.  ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణీకులు మాస్క్‌లను తీయవద్దని డీజీసీఏ సూచించింది.  విమానశ్రాయ ఎంట్రీలో మోహరించిన సిఐఎస్ఎఫ్ , ఇతర పోలీసు సిబ్బంది మాస్క్‌ ధరించకుండా ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో  ఎవరీనీ అనుమతించకుండా చూసుకోవాలని తెలిపింది.

ఈ విషయాన్ని  వ్యక్తిగతంగా  భద్రత , తనిఖీ అధికారులు,ఇతర పర్యవేక్షక అధికారులు చూడాలని డీజీసీఏ కోరింది.విమానాశ్రయ ప్రాంగణంలో ప్రయాణీకులు సరిగ్గా మాస్క్‌లు ధరించేలా చూడాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని విమానాశ్రయ డైరెక్టర్, టెర్మినల్ నిర్వాహకులను డీజీసీఏ కోరారు. ఒకవేళ, ఎవరైనా ప్రయాణీకులు “కోవిడ్ -19 ప్రోటోకాల్” ను ఉల్లంఘింస్తే హెచ్చరికలను జారీ చేయాలని,  తరువాత కూడా వినకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది.