బెంగాల్ బీజేపీలోకి మ‌రో ఇద్ద‌రు సినిమా తారలు 

ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి మ‌రింత రాజుకుంది. అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇవాళ నందిగ్రామ్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి.. కొన్ని నెలల క్రితం త‌న పార్టీని వీడి టీఎంసీలో చేరిన సువేందు అధికారిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

సువేందు అధికారి కూడా మ‌మ‌త అంతేస్థాయిలో కౌంట‌ర్ ఇచ్చారు. నందిగ్రామ్‌లో మ‌మ‌తాబెన‌ర్జిపై బీజేపీ త‌ర‌ఫున సువేందు పోటీకి దిగ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న శనివారం నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఇదిలావుంటే ప్రచార జోరులో మాత్రం బీజేపీ కంటే టీఎంసీ వెనుక‌బ‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. పోటాపోటీగా ప్ర‌చారం చేస్తున్నా బీజేపీలోకి టీఎంసీ నుంచి వ‌ల‌స‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. టీఎంసీలో మాత్రం బ‌య‌టికి వెళ్లేవారే త‌ప్ప వ‌చ్చేవారెవ‌రూ క‌నిపించ‌డం లేదు. 

బీజేపీలోకి టీఎంసీ నుంచేగాక సినీరంగం నుంచి కూడా చేరిక‌లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల మిథున్ చ‌క్ర‌వ‌ర్తి పార్టీలో చేర‌గా ఇప్పుడు యువ‌న‌టి రాజ్‌శ్రీ రాజ్‌బ‌న్షీ, సీనియ‌ర్ న‌టుడు బొన్ని సేన్ గుప్తా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.      

ఇలా ఉండగా,  ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో వీరు సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వీరిని ‘ఎన్నికల హిందువులు’గా అభివర్ణించారు. వీరు ఎన్నికలు వచ్చినపుడు దేవాలయాలకు వెళ్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. 

గిరిరాజ్ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, మమత బెనర్జీ, రాహుల్ గాంధీ ‘ఎన్నికల హిందువులు’ అని పేర్కొన్నారు. వీరు అపీజ్‌మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ప్రజల నుంచి, మోదీ నుంచి ఒత్తిడి వస్తుండటంతో మమత, రాహుల్ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారన్నారు. అధికారంలోకి రాగానే దుర్గా పూజపై నిషేధం విధిస్తారని పేర్కొన్నారు. 

బెంగాల్‌‌లో రొహింగ్యాల మాదిరిగానే మమత బెనర్జీ ఆందోళనగా ఉన్నారని గిరిరాజ్ చెప్పారు. దేవాలయానికి వెళ్ళాలా? మసీదుకా? అనే విషయాన్ని ఈ నేతలు నిర్ణయించుకోలేకపోతున్నారని చెప్పారు.