కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షించిన భారత్

ప్రపంచ స్థాయి ప్రముఖ సంస్థల సహకారంతో భారత్, కొవిడ్ 19 వ్యాక్సిన్లు సరఫరా చేయడంతో ప్రాణాంతక కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షించగలిగిందని, ఆదేశం అందించిన సాయం తక్కువ అంచనావేయలేమని అమెరికా అగ్రస్థాయి శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ హొటెజ్ ప్రశంసించారు. ఔషధాలపై సమగ్ర పరిజ్ఞానం, అపార అనుభవంతో కరోనా విపత్కాలంలో ప్రపంచానికే ఫార్మసీగా భారత్ పేరుపొందిందని ఆయన అభివర్ణించారు. 

హోస్టన్‌లో బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ (బిసిఎం) లో నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ గ్రేటర్ హోస్టన్ నిర్వహించిన వెబ్‌నార్‌లో కొవిడ్ 19 : వాక్సినేషన్ అండ్ పొటెన్షియల్ రిటర్న్ టు నార్మల్సీఅనే అంశంపై ఆయన మాట్లాడారు.

ఎంఆర్‌ఎన్‌ఎ రెండు వ్యాక్సిన్లు స్వల్ప, మధ్యాదాయ దేశాలను ఏమాత్రం ప్రభావితం చేయకపోవచ్చు కానీ, భారత్‌కు చెందిన వ్యాక్సిన్లు ప్రపంచం లోని బిసిఎం, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీల సహకారంతో ప్రపంచాన్ని మహమ్మారి నుంచి కాపాడాయని ఆయన వివరించారు. కరోనాను తుదముట్టించడానికి భారత్ వ్యాక్సిన్‌ను అందించడం ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతిగా ఆయన ప్రశంసించారు.

పుణె కేంద్రమైన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు బ్రిటిష్ ఫార్మాకంపెనీ ఆస్ట్రాజెనెకా నుంచి లైసెన్సు పొందిన తరువాత భారత్ జౌషధ నియంత్రణసంస్థ అత్యవసర వినియోగానికి అనుమతించింది. అలాగే కొవాగ్జిన్ వ్యాక్సిన్ స్వదేశీయంగా హైదరాబాద్ కేంద్రమైన బారత్ బయోటెక్ , ఐసిఎంఆర్ సంయుక్తంగా రూపొందించాయి.

వ్యాక్సిన్లను అందించడంలో భారత్ ప్రయత్నాలను డాక్టర్ హోటెజ్ ప్రశంసించడాన్ని కాన్సుల్ జనరల్ మహాజన్ అభినందించారు. ప్రపంచ కష్టసుఖాల్లో పాలుపంచుకునే సంప్రదాయాన్ని పాటిస్తూ భారత్ ప్రపంచం లోని అనేక దేశాలకు వ్యాక్సిన్ అందించిందని ప్రశంసించారు. 

ఐఎసిసిజిహెచ్ సంస్థాపక కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జగ్‌దీప్ ఆహ్లూవాలియా మాట్లాడుతూ కరోనా సంక్షోభానికి భారత్ స్పందించడం, దీన్ని హోటెజ్ గుర్తించడం ఇదంతా చాంబర్ విజన్‌లో నమోదవుతుందని, 21ఏళ్ల క్రితం ఈ సంస్థ ప్రారంభమైందని, భవిష్యత్‌లో టెక్నాలజీ, మెడిసిన్, మాన్యుపేక్చరింగ్ , ఇంటర్నేషనల్ ట్రేడ్ తదితర రంగాల్లో భారత్ భవిష్యత్ మార్గదర్శిగా కీలకపాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. ఈ నమ్మకం గత దశాబ్దకాలంలో నిరూపించబడిందని తెలియచేశారు.