నందిగ్రామ్‌లో మమతతో పోటీకి సువేందు సై 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీపై  మాజీ మంత్రి సువేందు అధికారిని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. 

ఈ ఏడాది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి తాను మమతాబెనర్జీని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే తాను నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని, తాను ఈ నెల 11వతేదీన నామినేషన్ సమర్పిస్తానని మమతాబెనర్జీ ప్రకటించారు. 

బీజేపీ సువేందు అధికారి అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో నందిగ్రామ్ లో పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. టీఎంసీలో ఉన్నపుడు సువేందు అధికారి మమతాబెనర్జీకి అనుంగు అనుచరుడిగా గుర్తింపు పొందారు. నందిగ్రామ్ లో అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం  బలవంతంగా చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా మమతాబెనర్జీ పోరాడి అధికారంలోకి వచ్చారు.

అయితే అధికారంలోకి తీసుకువచ్చిన నందిగ్రామ్ ను మమతాబెనర్జీ విస్మరించారని బీజేపీలో చేరిన సువేందు అధికారి విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంమీద నందిగ్రామ్ అసెంబ్లీ సమరం సువేందు అధికారి రంగంలోకి దిగనుండటంతో ఆసక్తికరంగా మారింది.

ఇలా ఉండగా, బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ ను కేంద్ర బీజేపీ పరిశీలకుడిగా బెంగాల్ రాష్ట్రానికి పంపిస్తున్న నేపథ్యంలో ఆయనకు జడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. 

బెంగాల్ ఎన్నికల్లో హింసాకాండ చెలరేగే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిత్యానందరాయ్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతోపాటు సీఆర్ పీఎఫ్ జవాన్లను రక్షణగా నియమించాలని నిర్ణయించారు. గతంలో బీజేపీ నేతలు జేపీ నడ్డా, కైలాష్ విజయవర్గీయల కాన్వాయ్ లపై దాడి జరిగిన నేపథ్యంలో బీజేపీలో చేరిన టీఎంసీ ఎమ్మెల్యే రజీబ్ బెనర్జీకి కూడా జడ్ కేటగిరి రక్షణ కల్పించారు.

బీజేపీలో చేరిన మాజీ మంత్రికి వై కేటగిరి భద్రత కల్పించారు. బెంగాల్ పర్యటన సందర్భంగా కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్ కు 10 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లతో భద్రత కల్పిస్తామని కేంద్రం వివరించింది.